వైస్సార్సీపీ లో మాటలు ధాటిగా మాట్లాడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది రోజానే అని చెప్పొచ్చు. చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పడం లో రోజా దిట్ట. అయితే జగన్ ప్రకటించిన హామీలను చంద్ర బాబు చేసుకుంటూ పోతున్నాడని , కాపీ కొడుతున్నాడని రోజా అంటుంది. అంతటితో ఆగని రోజా.. కాపీ కొట్టే స్టూడెంట్ ను ఏం చేస్తారని ప్రశ్నించి...డీబారే కదా చేసేది అంటూ సమాధానం కూడా చెప్పేసి.. మరి జగన్ ను కాపీ కొడుతున్న చంద్రబాబును కూడా డీబార్ చేయాల్సిందే కదా అని ఓ సరికొత్త వాదనను వినిపించారు. మరో మూడు నెలల్లో ఏపీ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జగన్ 14 నెలల పాటు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు.
యాత్రలో భాగంగా దాదాపుగా అన్ని జిల్లాల్లోని మెజారిటీ నియోజకవర్గాలను చుట్టేసిన జగన్... కుల వృత్తిదారులు - రైతులు - మహిళలు - వృద్ధులు - బడుగు - బలహీన వర్గాలు... ఇలా దాదాపుగా అన్ని వర్గాల ప్రజలను కలిశారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలన్న దిశగా ఆలోచన చేసిన జగన్ అక్కడికక్కడే తాను అదికారంలోకి వస్తే... సదరు సమస్యల పరిష్కారం కోసం ఏం చేస్తానన్న విషయాన్ని కూడా ఆయన చెప్పేశారు.ఈ క్రమంలోనే పింఛన్ సొమ్మును రూ.2 వేలకు పెంపు రైతులకు ఉచితంగా పెట్టుబడి సాయం - కనీస మద్దతు ధర.. ఇలా చాలా హామీలనే జగన్ ఇచ్చారు.
ఎన్నికలకు సమయం దగ్గరపడేదాకా వేచి చూసిన చంద్రబాబు... ఎన్నికల్లో మరోమారు అధికారం చేపట్టాలన్న కాంక్షతో జగన్ ఇచ్చిన హామీలను దాదాపుగా మక్కికి మక్కీ కాపీ కొట్టేశారు. దీంతో తమ పథకాలను కాపీ కొట్టేసిన చంద్రబాబు...కాపీ మాస్టరేనని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణల డోస్ను మరింతగా పెంచేసిన రోజా... ఏకంగా చంద్రబాబును ఔట్ డేటెడ్ వెర్షన్ గా అభివర్ణించేశారు. అంతేకాకుండా తన పార్టీ అధినేత జగన్ ను అప్ డేటెడ్ వెర్షన్గా చెప్పిన రోజా... జగన్ పథకాలను కాపీ కొడుతున్న చంద్రబాబును డీబార్ చేయాలని పిలుపునిచ్చారు. మొత్తంగా రోజా వేసిన ఈ సెటైర్ బాగానే పేలిందని చెప్పాలి.