ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సభనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. కేంద్రం సహకరించకపోయినా ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోందని ఆయన అన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఏపీ 11శాతం వృద్ధిరేటు నమోదు చేసిందరని చెప్పారు.
ఏపీ విభజన నష్టాల నుంచి కోలుకుని అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని గవర్నర్ అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదని చెప్పారు. నాలుగున్నరేళ్లలో విభజనహామీలతో పాటు ప్రత్యేకహోదా అమలుకాలేదని చెప్పారు.
కేంద్రం నుంచి ఆశించినంత సహకారం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తోందన్నారు గవర్నర్. అనేక రంగాల్లో ఇప్పటికే సంతృప్త స్థాయిని సాధించామని గవర్నర్ వివరించారు. అవినీతి రహిత పాలన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఎప్పటిలాగానే ఈ అసెంబ్లీ సమావేశాలకు కూడా ప్రతిపక్షం వైసీపీ హాజరుకాలేదు. ప్రజాసమస్యలపై స్పందించే అవకాశాన్ని ప్రతిపక్షం జారవిడుచుకుంటోందని అధికార పార్టీ నేతలు విమర్శించారు. రాష్ట్ర సమస్యలపై పోరాటానికి కలసిరావాలని స్పీకర్ కోడెల పిలుపునిచ్చారు.