తెలంగాణా ఎన్నికల్లో తప్పుడు సర్వే
ఫలితాలిచ్చి లగడపాటి రాజగోపాల్ నవ్వులపాలైన విషయం అందరికీ తెలిసిందే. మామూలుగా
అయితే లగడపాటి ఎన్నికల సర్వేలకు విశ్వసనీయగా బాగానే ఉంది. కానీ మొన్నటి తెలంగాణా
ఎన్నికల్లో మాత్రం మహాకూటమిని ఇంకా గట్టిగా చెప్పాలంటే చంద్రబాబును కాపాడేందుకే
తప్పుడు సర్వేలను విడుదల చేశారు. అంటే లగడపాటి చేసిన సర్వేలో కెసియార్ అధికారంలోకి
వస్తాడని తెలిసి కూడా మహాకూటమిదే అధికారమంటూ అందరిని తప్పుదోవ పట్టించేట్లుగా తప్పుడు
సర్వే ఫలితాలు విడుదల చేశారు.
లగడపాటి సర్వేలో చెప్పిందొకటైతే ఫలితాల్లో వెల్లడైంది మరొకటి. ఇక్కడ విషయం ఏమిటంటే లగడపాటి మీద నమ్మకంతో కెసియార్, మహాకూటమి విజయావకాశాలపై కోట్ల రూపాయలు పందేలు కాసి నెత్తిన గుడ్డేసుకున్నారు చాలామంది. దాంతో ఇటు తెలంగాణాలోనే కాకుండా అటు ఏపిలో కూడా లగడపాటిపై పెద్ద ఎత్తున జనాలు మండిపోయారు. నిజం చెప్పాలంటే లగడపాటి మీదున్న మంట ఇంకా జనాల్లో చల్లారలేదు. వాస్తవాలు ఇలా వుండగా తాజాగా మళ్ళీ లగడపాటి మీడియా ముందుకొచ్చారు. తెలంగాణాలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు పుంజుకోవటంపై మాట్లాడారు. నెలన్నర రోజుల వ్యవధిలోనే ఫలితాల్లో తేడాలు రావటంపై తనను తానను సమర్ధించుకుంటు మాట్లాడారు.
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో తన సర్వేలు తప్పుడు పోవటంలో ఆశ్చర్యం ఏమీ లేదన్నారు. తాను ఎవరికో అమ్ముడుపోయి తప్పుడు సర్వేలు చేయలేదని సమర్ధంచుకున్నారు. తాను ముక్కుసూటిగా వెళ్ళే వ్యక్తిగా తన భుజాన్ని తానే చరుచుకున్నారు. పదేళ్ళు కాంగ్రెస్ ఎంపిగా ఉన్న కారణంగా కాంగ్రెస్ కు అండర్ కరెంటు ఉందని పొరపాటు పడివుండవచ్చని చెప్పుకున్నారు. అండర్ కరెంటు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నదో కూడా గ్రహించలేకుండనే లగడపాటి సంవత్సరాలుగా సర్వేలు చేస్తున్నారంటే నమ్మే వాళ్ళు ఎవరూ లేరు. తెలంగాణా ఫలితాలపై ఇంత వరకూ నోరిప్పే అవకాశం లగడపాటికి రాలేదన్నది వాస్తవం. అలాంటిది పంచాయితీ ఎన్నికల్లో కాసిని పంచాయితీలు ప్రతిపక్షాలకు వచ్చేటప్పటికి తనను తాను సమర్ధంచుకునే అవకాశం వచ్చిందంతే.