అమృతవర్షిణి కలలు నెరవేరాయి..పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అమృత, ప్రణయ్ పెళ్లి చేసుకొన్న రోజునే అమృత మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ కులం కాని వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న అక్కసుతో అమృత తండ్రి మారుతీరావు ఆమె భర్త ప్రణయ్ గత ఏడాది సెప్టెంబర్ 14వ తేదీన మిర్యాలగూడలో హత్య చేయించిన విషయం తెలిసిందే. ఒకే స్కూల్లో చదువుకొనే ప్రణయ్, అమృతలు స్కూల్ లోనే ప్రేమలో పడ్డారు. ఇంజనీరింగ్ చేసే సమయంలో అమృత తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి అమృతను మందలించారు. అన్ని రకాలుగా అమృతను, ప్రణయ్ ని అతని కుటుంబ సభ్యులను కూడా భయ పెట్టారు..కానీ వీరి ప్రేమకు మాత్రం అడ్డుకోలేక పోయారు.
ప్రణయ్ అమృతలు గత ఏడాది ఇదే రోజున హైద్రాబాద్ ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకొన్నారు. పెళ్లి చేసుకొన్న తర్వాత చాలా కాలం మిర్యాలగూడకు దూరంగా ఉన్నారు. ఇక అమృత గర్భం దాల్చిన తర్వాత మిర్యాలగూడలో తమ తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు ప్రణయ్. అమృత, ప్రణయ్ అతని తల్లి ఆసుపత్రిలో చెకప్కు వెళ్లిన సమయంలో గత ఏడాది సెప్టెంబర్ 14 వ తేదీన కిరాయి హంతకులు..అమృత కళ్ల ముందే అత్యంత దారుణంగా నరికి చంపాడు. అమృత తండ్రే కిరాయి హంతకులతో కూతురు భర్త ప్రణయ్ను చంపించడంపై తెలుగురాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.
ఇక ప్రణయ్ హత్య తరువాత చాలా మంది ఆమెను అబార్షన్ చేయించుకోమన్నారు. కానీ బిడ్డకు జన్మనిచ్చి ప్రణయ్ ప్రతిరూపంగా చూసుకుంటూ బతుకుతానని అమృత అప్పుడే చెప్పారు. అప్పటినుంచి ఆమె అత్తింటివారి సంరక్షణలోనే ఉంది. ప్రణయ్, అమృతలు పెళ్లి చేసుకొన్న రోజునే అమృత పండంటి బిడ్డకు హైద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని అమృత కుటుంబ సభ్యులు ప్రకటించారు. పెళ్లి రోజునే అమృత మగబిడ్డకు జన్మనివ్వడంతో ప్రణయ్ మళ్లీ పుట్టాడని కుటుంబసభ్యులు సంబరపడుతున్నారు.