పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనాలిస్తే కచ్చితంగా ఆ పార్టీకే ఓటెయ్యాలా? అలా ఐతే అంటే పథకాల ద్వారా ప్రయోజనాలు పొందిన వారే ప్రభుత్వానికి ఓట్లేయటాన్ని “క్విడ్ ప్రోకో” అనాలా! ఓటు కు నోటు లేదా ప్రయోజనం అనాలా! ప్రభుత్వాలు ఏమిచ్చినా ప్రతిదీ ప్రజాధనమే — నాయకులు వారింటి నుండి తెచ్చి ప్రజలకు ఏమీ ఇవ్వట్లేదు. ప్రజాధనంతో ప్రజలకు ప్రభుత్వం చేసే ప్రయోజనాలు సమకూర్చే వసతులు అభివృద్ధి తదితరాలు ప్రభుత్వ విధి. దానికి ప్రజలు ప్రభుత్వ అధికారంలో ఉన్న పార్టికి ఓటేయటం, లేదా ఇంకా ఏ విధమైన ప్రతిఫలం ఏరూపం లోనూ ఇవ్వ నవసరంలేదు. ప్రజలు ఎన్నుకున్నందుకు వారు ప్రజలకు సేవచేయటం రాజ్యాంగ బాధ్యత.
ప్రజాస్వామ్య సాంప్రదాయాలు రోజురోజుకు దిగజారి పోతూ ఉన్నాయి. ఏపి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు టీడీపీకి ఓటు ఎందుకు వేయాలి? అని ప్రశ్నించే వారిని ‘బూతులు’ తిట్టాల్సిందిగా పార్టీ కార్యకర్తలకు వివాదాస్పదమైన హితబోధ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి మండలం సంతమైదానంలో కార్యకర్తలతో మంత్రి సమావేశం అయ్యారు. అక్కడ కార్యకర్తల లో ఉప్పొంగుతున్న ఉత్సాహాన్ని చూసి ఆయనలో దాగివున్నమరో వ్యక్తి బయటకు వచ్చారు. కారుకూతలు రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడారు. అప్పుడు మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
ఎవరైనా మనకి వ్యతిరేకంగా మాట్లాడితే, ఏమిరా?
*వంద యూనిట్లు ఫ్రీ విధ్యుత్ తీసుకుంటున్నావు.
*మీ ఆవిడ ₹10,000 దొబ్బంది.
*మీ అమ్మకు ₹3000 ఇచ్చారు.
*మొన్న రుణమాఫీ వస్తే అది దొబ్బావ్.
ఇవన్నీ దొబ్బి మళ్లీ మనకి ఓట్లు వేయకుండా తిడుతుంటే, ధర్మమా? అని మీరు అడగాలి. నేను కాదు.
నేను చెప్పింది తప్పా! చెప్పండి. మన పథకాలన్నీ తీసుకుని మళ్లీ మనల్ని తిడతాడు. మనకి ఓటు వేయకపోయినా ఫర్వాలేదు. పైగా తిడుతుంటారు. అలాంటి వారిని మీరు నిలదీయాలి.’ అని అచ్చెన్నాయుడు కార్యకర్తలకు హితబోధ చేశారు.
ప్రజలు ఒకే సమాధానం చెప్పాలి వారు పొందిన ప్రయోజనాలు అచ్చెన్నాయుడు అబ్బ సొమ్ము కాదని ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్మని చెప్పాలి. ఇలా దూషించిన వారికి ఓటేయటమే తప్పు అని నిర్ద్వంధంగా చెప్పాలి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ప్రజల మీద టీడీపీ ప్రభుత్వం వరాలు కురిపిస్తోంది.
ఆసరా పింఛన్లను రెట్టింపు చేసింది. జనవరి 1నుంచి ఇది అమల్లోకి రానుంది.
ఫిబ్రవరి 2నుంచి పెంచిన పింఛన్లను చెల్లిస్తారు. జనవరిలో ఇస్తామన్నది కూడా కలుపుకొని ఈసారి పింఛను రూ.3000 ఖాతాలో జమ కానుంది.
అలాగే, మరో రెండు వారాల్లో రైతులకు తుది విడుత రుణమాఫీ చేస్తామని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ నరసింహన్ తన ప్రసంగంలో ప్రకటించారు.
డ్వాక్రా సంఘాల మహిళలకు ₹10,000 నగదు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. మూడు విడుతల్లో చెక్కుల రూపంలో ఇస్తారు.
మొదటి చెక్కు ₹2,500. రెండో చెక్కు ₹.3,500. మూడో చెక్కు ₹4000 చొప్పున చెల్లిస్తామని చంద్రబాబు ప్రకటించారు.
ప్రజలు అన్ని ప్రయోజనాలు కుల మత లింగ ప్రాంత రహితంగా పొందాలి దానికి ఏ ప్రతిగా ప్రభుత్వానికి ఏరూపంలోను చెల్లించనవసరం లేదు. అంతేకాదు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీకి గాని ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి గాని ఇంకా ఏ యితర పార్టీకైనా ఓటువేయవచ్చు. అది వారి చాయిస్. అంతే అచ్చెన్నాయుడుకు గాని మరే యితర మంత్రికిగాని ముఖ్యమంత్రికి గాని ప్రశ్నించే అధికారం ఇసుమంతైనా లేదు. వాళ్ళు ఓటేయమని ఓటరును అర్ధించవచ్చు. అంతే.