త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు...ఏపీ ప్రజలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఒకపక్క కేంద్రం రాష్ట్రానికి ఏ విధంగా న్యాయం చేసిందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ మరోపక్క విభజన తో కూడిన ఆంధ్ర రాష్ట్రం లో సంచలన హామీలు ప్రకటిస్తూ సామాన్య ప్రజలకు బాసట గా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రతిపక్ష పార్టీలకు మతిపోయేలా రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా చంద్రబాబు అమరావతి ప్రాంతంలో తుళ్లూరు మండలం వెంకటపాలెంలో కలియుగ దైవం శ్రీవారి ఆలయ నిర్మాణానికి మొదటి ఆడుగు పడింది.
సిఎం చేతుల మీదాగా ఆగమోక్తంగా వైదిక క్రతువులను నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి భూకర్షణం, బీజావాపనం కోసం చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. గర్భగుడి ప్రాంతంలో సీఎం నాగలితో భూమి దున్ని నవధన్యాలు చల్లారు. తితిదే వేదపండితులు శాస్త్రోక్తంగా గోపూజ, కలశ పూజ నిర్వహించారు. తిరుమల పెద్దజీయంగార్ స్వామి ఆధ్వర్యంలో కైంకర్యాలు జరిగాయి.
భూకర్షణ ప్రాంతంలో గోవు, కలశంతో ప్రదక్షిణ చేశారు. అయితే రూ.150 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. దీని కోసం ప్రభుత్వం సేకరించిన 25 ఎకరాల స్థలాన్ని తితిదే తన ఆధీనంలోకి తీసుకుంది. ఫిబ్రవరి 10న ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించనున్నారు. మొత్తంమీద ఎన్నికల ముందు చంద్రబాబు అమరావతిలో మరో అద్భుతానికి శ్రీకారం చుట్టారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.