చూడబోతే అలాగే కనిపిస్తోంది. క్షేత్రస్ధాయిలో
జరుగుతున్న పరిణామాలు కూడా అందరిలోను అనుమానాలను పెంచేస్తున్నాయ్. అందుకు తాజా
ఉదాహరణ ఏమిటంటే ? అమరావతి పరిధిలో నిర్మించనున్న వెంకటేశ్వర ఆలయానికి గురువారం
చంద్రబాబునాయుడు శంకుస్ధాపన చేశారు. మంత్రివర్గంలోని ఐదుగురితో పాటు ఎంపిలు,
ఎంఎల్ఏలు, నేతలు కూడా హాజరయ్యారు. ఇంతమంది పాల్గొన్న దైవకార్యక్రమంలో కెఇ
కృష్ణమూర్తి ఎక్కడా కనబడలేదు. కెఇ విజయవాడలోనే ఉన్నా కార్యక్రమానికి గైర్హాజరవ్వటం
అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇక్కడ కెఇ గురించే ఎందుకంతగా చెప్పుకుంటున్నామంటే దేవాదాయ శాఖ మంత్రి ఆయనే కాబట్టి. అంటే దేవాదాయ శాఖా మంత్రే ఆ శాఖకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనలేదు. మామూలుగా అయితే ఏ శాఖలో అయినా భారీ కార్యక్రమం చేపడుతున్నారంటే సదరు మంత్రే అన్నీ తానై చూసుకోవటం సహజం. దాదాపు 120 కోట్ల రూపాయల వ్యయంతో రాజధాని ప్రాంతంలో నిర్మించనున్న వెంకటేశ్వరాలయ శంకుస్ధాపన కార్యక్రమానికే మంత్రి ఎందుకు గైర్హాజరయ్యారు ? ఎందుకంటే, మంత్రికి అసలు ఆహ్వానమే అందలేదు. ఆ విషయాన్ని స్వయంగా కెఇనే చెప్పారు. దేవాలయ శంకుస్ధాపనకు సంబంధించి తనకు ఆహ్వానం అందలేదని చెప్పటాన్ని గమనించాలి.
దేవాదాయ శాఖ కార్యక్రమాల్లో కెఇని విస్మరించటం ఇదే తొలిసారి కాదు. విజయవాడలోని దుర్గగుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా మంత్రికి ఆహ్వానం అందలేదు. కెఇ ఒక్క దేవాదాయ శాఖకు మాత్రమే మంత్రి కాదు. రెవిన్యూ లాంటి కీలకమైన శాఖకు కూడా మంత్రే. అంతేకాకుండా ఉపముఖ్యమంత్రి కూడా. అన్నిటికన్నా మించి బిసి నేత. టిడిపి మొత్తం మీద ఉన్న సీనియర్లలో ఒకరు. ఇన్ని అదనపు అర్హతలున్న కెఇని ఎందుకు ఇంతగా నిరాధరిస్తున్నారు చంద్రబాబు ?
పార్టీ వర్గాలు చెప్పిన దాని ప్రకారం కెఇని పక్కన పెట్టాలని చంద్రబాబు అనుకుని చాలా కాలమే అయ్యింది. అందుకే రెవిన్యూ డిపార్టుమెంటులో జరిగే సాధారణ బదిలీలు కూడా కెఇకి తెలీకుండానే జరిగిపోతుంటాయి. పైగా కెఇ చేసిన బదిలీలు చెల్లటం లేదు. నిజానికి చంద్రబాబు మంత్రివర్గంలో కావచ్చు లేదా ప్రభుత్వం, పార్టీలో కెఇకి బాగా అవమానాలు జరుగుతున్నట్లే అనుకోవాలి. అయినా కెఇ ఎందుకు ఓర్చుకుంటున్నారంటే రాజకీయంగా చరమాంకంలో ఉన్నారు కాబట్టే అనుకోవాలి.
కెఇకి వయసు కూడా అయిపోయింది. దగ్గర దగ్గర 80 ఏళ్ళకు దగ్గరలో ఉన్నారు. రాజకీయంగా రిటైర్ అవుతున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో తనకు బదులు పత్తికొండలో తన కొడుకు కెఇ శ్యాంబాబును పోటీ చేయిస్తున్నారు. రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టే అవమానాలను కెఇ దిగమింగుకుంటున్నట్లు కనబడుతోంది. పైగా గట్టిగా మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో కొడుక్కి, తమ్ముడికి కూడా టిక్కెట్టులో కోత పడుతుందేమోనన్న టెన్షన్ కూడా ఉండుంటుంది. అందుకనే అన్నీ అవమానాలను భరిస్తున్నారు. ఎంతలేండి ఇంకో మూడు నెలలు ఓపికిపడితే ఎన్నికలు వచ్చేస్తాయి కదా ?