వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కాలని , అధికారంలోకి రావాలని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించి వ్యూహాలపై వ్యూహాలు వేస్తూ.. ముందుకు సాగుతున్నారు. మరి ఈయనకు సొంత మనుషులుగా ఉన్న నాయకులు ఈ వ్యూహంలో ఏమేరకు కలిసి వస్తున్నారు? ఎలా సహకరిస్తున్నారు? అనేది ప్రశ్నార్థ కంగా మారిపోయింది. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో వైసీపీ రాజకీయాలు రోజుకోరకంగా మారుతున్నాయి. దీనికి ప్రధాన కారణం... జగన్కు బంధువులుగా ఉన్న బావ, బావమరుదులు బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలే. ఇక్కడ ఒకరిపై ఒకరు ఆధిపత్య ధోరణులను ప్రదర్శించుకుంటున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే పలు కీలక నియోజకవర్గంలో బాలినేనిపై పైచేయి సాధించాలని వైవీ ప్రయత్నించారు. కొండపిలో నియోజకవ ర్గం సమన్వయకర్తను మార్చేశారు. ఇక, బాలినేనిపై లేనిపోని చాడీలను ప్రచారం చేశారు. ఇక, ఇదేసమయంలో వైవీపై పై చేయి సాధించేందుకు బాలినేని కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సాధ్యమైనంతవ రకు వైవీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైవీ మళ్లీ ఒంగోలు ఎంపీ టికెట్పై ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ వైసీపీకి కంచుకోటగా ఉన్న ఈ టికెట్ను ఎవరికి కేటాయించినా గెలిచే పరిస్థితి ఉండడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో తాను గెలుస్తానని వైవీ ధీమాగా ఉన్నారు. అయితే, గతంలో తాను పార్టీ మారిపోతానంటూ విపరీతమైన ప్రచారం చేయించి న వైవీకి బుద్ధి చెప్పాలని అనుకున్న బాలినేని దీనికి అనుగుణంగా చక్రం తిప్పుతున్నారు.
ఇప్పుడు తనకు అందివచ్చిన అవకాశంగా చేసుకుని వైవీకి వ్యతిరేకంగా చక్రం తిప్పుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీకి ఏకంగా వైఎస్ షర్మిల రడీ అవుతున్నారంటూ.. పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చేలా చేశారు. కేడర్లోనూ ఈ తరహా ఆలోచన ఉండడంతో ఇదినిజమేనని అనిపించే రేంజ్లో ఇక్కడ రాజకీయం ఒక్కసారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది.
దీంతో ఈ ఇద్దరు నాయకుల వ్యక్తిగత కీచులాటలు, ఆధిపత్య పోరుతో ప్రకాశం జిల్లాలో వైసీపీ తీవ్ర ఇక్కట్టు పడుతోంది. మరి దీనిని సరిచేసేందుకు పార్టీ అధినేతగా జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఏదేమైనా.. సొంత మనుషులే పార్టీని ఇలా బలహీన పరిచేలా వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు జోరందుకున్నాయి.