2004 నుండి 2014 దదాపు ఒక దశాబ్ధం పాటు ఉత్తరప్రదేశ్ రాంపూర్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించిన భారతీయ అద్భుత నటి ప్రఖ్యాతిగాంచిన అందాల నటి జయప్రద. ఎనిమిది దేశ బాషల్లో అవక్రవిక్రమంగా నటించిన, ఈమె 1994 లో ఆంద్రుల ఆరాధ్య నటుడు మహానాయకుడు ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలోకి ప్రవేశించారు. 1996 లో రాజ్యసభ సభ్యురాలుగా నామినేట్ చెయ్యబడ్దారు. తెలుగుమహిళ నాయకురాలుగా పని చేసిన తరవాత టిడిపి నాయకత్వంతో వచ్చిన విభేదాలతో సమాజ్వాది పార్టిలో అమర్సింగ్ సహాయంతో చేరిపోయారు.
తాను అమర్ సింగ్ కు రాఖీ కట్టినా జనం తమకు తోచినట్టు మాట్లాడుకుంటున్నారని జయప్రద వ్యాఖ్యానించారు. ముంబైలో జరుగుతున్న క్వీన్స్లైన్ లిటరేచర్ ఫెస్టివల్ లో శుక్రవారం జయప్రద పాల్గొన్నారు. అమర్ సింగ్ తో తనకున్న రాజకీయ అనుబంధాన్ని, ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో తన ప్రత్యర్థి, ఎస్పీ సీనియర్ నేత అజమ్ ఖాన్ వల్ల తాను పడిన బాధలను ఆమె వివరించారు.
తన అభివృద్ధికి చాలామంది సహకరించారని, వారిలో అమర్ సింగ్ ఒకరని ఆయనను గాడ్-ఫాదర్లా భావిస్తానని చెప్పారు. అజమ్ ఖాన్తో జరిపిన పోరాటంలో, ఒక దశలో తనపై యాసిడ్ దాడికి కూడా ఆయన ప్రయత్నించారని ఆమె ఆరోపించారు. మార్ఫింగ్ చేసిన ఫొటోలతో అల్లరి పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులు తట్టుకోలేక ఒకసారి తాను ఆత్మహత్యాయత్నం కూడా చేసినట్టు తెలిపారు.
ఆ సమయంలో సమాజ్వాదీ పార్టీ ఎంపీగా ఉన్న తనకు, అధినేత ములాయం సింగ్ యాదవ్ సహా ఏ ఒక్క నాయకుడు కూడా తనపట్ల కనీసం సానుభూతి చూపించ లేదని, అప్పుడు అమర్ సింగ్ డయాలసిస్ చేయించుకుంటూ దూరంగా ఉన్నారని ఆమె చెప్పారు. ఆస్పత్రి నుంచి తిరిగి రాగానే అమర్ సింగ్ తనను కలిసి ధైర్యం చెప్పినట్లు తెలిపారు. పురుషాధిపత్య రాజకీయాల్లో ఒక మహిళ నిలదొక్కుకోవాలంటే యుద్ధమే చేయాల్సి ఉంటుందని ఆమె అన్నారు.