వైస్సార్సీపీ పార్టీ 2019 ఎన్నికల్లో అధిక సీట్లు గెలుచుకుంటుందని ఇప్పటికే మీడియా ఛానెల్స్ ప్రకటిస్తున్నాయి . అయితే ఈ సర్వేలను ఎంత వరకు నమ్మొచ్చు. ఇప్పటికే చాలా సార్లు ఈ సర్వేలు చిలక జోస్యం గా మిగిలిపోయినాయి. సర్వేల ఫలితాలను చూసి.. ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోవచ్చునా? ఈ సర్వేలు... ఇవాళ్టి ప్రజల అభిప్రాయాలనే ప్రతిబింబిస్తుండవచ్చు గాక... కానీ, ఎన్నికలు జరిగే సమయానికి వారిని ఇతరత్రా ప్రలోభాలు, పోల్ మేనేజిమెంట్ నైపుణ్యాలు ప్రభావితం చేయకుండా ఉంటాయా? అనేది కీలకాంశం.
తెలుగుదేశం పార్టీ ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా.. అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి సమృద్ధిగా ఆర్థిక వనరులను సమకూర్చుకునే ఉంది. చంద్రబాబునాయుడు తన అమ్ములపొదిలోంచి సకల మాయోపాయాలను, ప్రజలను మభ్యపుచ్చగల సంక్షేమపథకాలను బయటకు తీస్తున్నారు. వీటన్నింటినీ మించి- తుదిక్షణంలో కీలకమైన 'పోల్ మేనేజిమెంట్'లో పచ్చదళాలు ఆరితేరి ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో... విజయం దక్కించుకోవాలంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ అప్రమత్తం కావాల్సి ఉంది. ఆయాకోణాల్లో తామెంతవరకు దీటుగా ఉన్నామో వారు ఒకసారి ఆత్మసమీక్ష చేసుకోవాల్సి ఉంది.
ఎన్నికల సమయంలో ఉధృతంగా ఉండే సీజనల్ వ్యాపారం సర్వేలు. వెల్లడయ్యేవి వాస్తవాలు అవునో కాదో.. సర్వేలు శాస్త్రబద్ధంగా జరుగుతున్నాయో లేదో పుటం వేసి.. నిగ్గు తేల్చగలవారు తక్కువ. నాయకుల్లో మరీ తక్కువ. సర్వేల పేరుతో తమ పంచన చేరే వారిలో ఎవరో ఒకరిని ఎంచుకుని.. వారితో నాయకులు సర్వే చేయించుకుంటూ ఉంటారే తప్ప.. వారి నిర్దిష్టతను గుర్తించగలిగి మాత్రంకాదు. ఒకే ప్రదేశంలో వేర్వేరు నాయకులు, వేర్వేరు సంస్థలతో సర్వేలు చేయిస్తున్నప్పుడు.. ఫలితాలు కూడా వేర్వేరుగా వస్తుంటాయి. ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. కాబట్టి జగన్ అతి విశ్వాసానికి పోతే మాత్రం భారీ మూల్యం తప్పదు.