ఏపీలో రాజకీయాలు మరుగుతున్నాయి. వైసీపీని మించిపోయి అధికారంలోకి వచ్చేయాలని టీడీపీ, ఈ రెండు పార్టీలను అంతం చేసి అధికారంలోకి రావాలని కొత్తగా పుట్టిన జనసేనలు ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార టీడీపీ ఈ విషయంలో చాలా దూకుడుగా ఉంది. ఇక, వైసీపీ, జనసేనలు టీడీపీ వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణయాలను తదేకంగా చూస్తూ.. ఇక్కడి పరిస్థితిని అంచనా వేసుకుని తమకు అనుకూలంగా మార్చుకునేందుకురెడీ అయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను సైతం సిద్ధం చేసుకుంటున్నాయి. చంద్రబాబు ప్రజలను తనవైపు తిప్పుకొనేందుకు ఇప్పటికే సంక్షేమ పథకాలను మరింతగా పెంచారు. ముఖ్యంగా కోటి మందికి పైగా ఉన్న మహిళల ఓట్లను తనవైపు తిప్పుకొంటున్నారు.
ఈ క్రమంలోనే పింఛన్లు, డ్వాక్రా పసుపు-కుంకుమ వంటి పథకాలను భారీ ఎత్తున అమలు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జోరు పెరిగిందనే చెప్పాలి. అయితే, దీనికి విరుగుడుగా వైసీపీ కూడా కొన్ని కొత్త పథకాలతో ప్రజల్లోకి వచ్చేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ప్రజలపై వరాల వర్షం కురిపించేందుకు రెడీ అయ్యారు. అదే సమయం లో జనసేనాని పవన్ కూడా ఇప్పటికే ప్రజలకు అనేక వరాలు ప్రకటించాడు. ఈయన కూడ చంద్రబాబు వ్యూహాలకు అనుగుణంగా చెక్ పెట్టేందుకు పక్కా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే.రెండో వైపు ఆయా పార్టీల ప్రణాళికలపై ప్రజలు ఏమనుకుంటున్నారు? అనేది ఆసక్తిగా మారింది.
ప్రజాసంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి పథకాలు ప్రకటించడానికి ప్రజలు వ్యతిరేకం కాదు. అయితే, ఇదేదో తమను ఎన్నికల సమయంలో మభ్యపెట్టి వినియోగించుకుని ఓటు వేయించుకునే రాజకీయం మాదిరిగానే ఉందని ప్రజలు అంటున్నారు. వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు ఇవ్వడాన్ని కాదనలేక పోయినా.. వారికి జీవితాంతం ఉపయోగపడే, ఆర్థికంగా బలాన్ని ఇచ్చే ఉపాధిని చూపించాలని కోరుతున్నారు. తమను ప్రభుత్వాలు ఇచ్చే పింఛన్లపై ఆధారపడకుండా.. తమ స్వశక్తిపై ఆధారపడేలా చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేసమయంలో ప్రభుత్వం తరఫున జరిగే ప్రతి పనినీ అవినీతి లేకుండా చేయాలని కోరుతున్నారు. ప్రతి విషయంలోనూ పారదర్శకత కోరుతున్నారు. నిత్యవాసరాలు సహా ప్రజోపయోగ వస్తువుల ధరలు పెరగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి దీనిని పార్టీల నాయకులు ఆలకిస్తారా.? చూడాలి.