కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్లు రాష్ట్రప్రభుత్వాలకు పూర్తిగా దాసోహం అవుతున్న నేపథ్యంలో కేంద్రం కొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. ప్రాంతం, కులం, మతం ఆధారంగా కొందరు ఐఏఎస్, ఐపీఎస్లు, ముఖ్యమంత్రులకు గులాంగిరి చేస్తూ ఏకంగా దేశ, ప్రజాప్రయోజనాలను నిర్దేశిత లక్ష్యాలను, తమ స్వార్ధప్రయోజనాలకు బలి చేస్తున్నారని కేంద్రం భావిస్తోంది. తాజాగా కోల్కతా లో సీబీఐ అధికారులను, రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయడాన్ని కేంద్రం సీరియస్గా తీసుకుంది. కోల్కతా నగర కమిషనర్ రాజీవ్ కుమార్ అఖిల భారత సర్వీస్ అధికారి అయి ఉండి కేంద్ర దర్యాప్తు సంస్థకు సహకరించక పోవడాన్నికేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది.
అటు ఏపీ లోనూ సీబీఐని రానివ్వం, ఐటీ అధికారులు వస్తే భద్రత కల్పించబోం అని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో దేశ విశాల హితం దృష్ట్యా పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. అఖిల భారత సర్వీస్ అధికారుల క్రమశిక్షణ, అప్పీల్ రూల్స్- 1969 కు సవరణ చేయనుందని దానిపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటి వరకు ఐఏఎస్, ఐపీఎస్లను నియమించేది కేంద్రమే అయినా, ఒకసారి వారిని రాష్ట్రాలకు కేటాయించిన తర్వాత పోస్టింగ్, బదిలీ, క్రమశిక్షణ చర్యలు అన్ని రాష్ట్రపరిధిలోనే ఉంచే సాంప్రదాయం అమలులో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాదిస్తేనే ఆ తర్వాత కేంద్రం బదిలీ, సస్పెన్షన్, వేటు వేయాల్సి ఉండేది.
కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వాలు కాలుదువ్వుతున్న నేపథ్యంలో, సర్వీస్-రూల్స్కు సవరణ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పరిస్థితి కేంద్ర సంస్థలను రాష్ట్రాల్లోకి ప్రవేశం నిషేధించటంతో ఏర్పడింది. మన పరిధిలో మనం ఎథిక్స్ మరిస్తే వారిని కేంద్ర సర్వీసులలో నియమించిన కేంద్ర ప్రభుత్వానికి వారి ప్రవర్తనా నియమావళి ప్రకారం నడుస్తున్నారా? లేదా? అని ప్రశ్నించి సరిచేసే హక్కు, వారితో సరిగా పనిచేయించే బాధ్యత ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ఆ ఆయుధం ప్రయోగించవచ్చు.
ఐఏఎస్, ఐపీఎస్లు రాష్ట్ర సేవలకు వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రులకు చంచాగిరి చేస్తూ అక్రమాలకు పాల్పడుతూ ఉంటే ముఖ్యమంత్రి, మంత్రులకు తానే అంటే తందానా అంటూ తప్పుడు పనులు చేసే వారికి, ప్రలోభాలకు లొంగి సహకరించే ధోరణికి అడ్డుకట్ట వేయకపోతే రాష్ట్ర ప్రభుత్వాల జవాబుదారి తనం మంటగలుస్తుంది. ఉదాహరణకు శారదా చిట్ ఫండ్ స్కాం నుండి టీఎంసీ ని కాపాడటానికి ఆధారాలను ద్వంసం చేసి చివరకు సీబీఐ అధికారులపై రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని ఉసిగొలిపిన తీరు గర్హనీయం. కారణం రాజ్యాంగ వ్యవస్థలలోని ఎక్జెక్యూటివ్ వ్యవస్థ పై అపాయింటింగ్ అధారిటీగా కేంద్ర ప్రభుత్వం పట్టు కోల్పోవటమే.
అంతే కాకుండా అనేక సందర్భాల్లో నిధుల దుర్వినియోగం, దుబారా, నిరర్ధక ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు, గుత్తేదార్లకు ముఖ్యమంత్రులు విచక్షణ రహితంగా వారి అర్హతలను పరిశీలించకుండా స్వార్ధప్రయోజనాలతో కాంట్రాక్టులు ఒప్పగించటం లాంటి ఎన్నో సంఘటనలపై చెక్ కోల్పోవటం జరుగుతుంది. ఐఏఎస్, ఐపీఎస్లను వారి సర్వీస్ రెగులేషన్స్ ప్రకారం పని చేయనిస్తే కేంద్రనియంత్రణ అవసరం ఉండదు. వారీపై సివిసి, కాగ్ లాంటి సంస్థల నియంత్రణ ఎలాగు ఉంటుంది.
క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండడం వల్లే ఐఏఎస్, ఐపీఎస్లు కేంద్రం మాట వినడం లేదని భావిస్తున్న నరేంద్ర మోడీ సర్కార్, ఇకపై ఐఏఎస్, ఐపీఎస్ లపై నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకునే వీలు లేకుండా రూల్స్ సవరణ చేయబోతోంది.
ఇలా చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు సలాం కొడుతూ బతకాల్సిన అవసరం ఐఏఎస్లకు, ఐపీఎస్లకు ఉండదని పరోక్షంగా చాటబోతోంది. అయితే బెంగాల్, ఏపీ ముఖ్యమంత్రుల వైఖరిని ఆధారంగా చేసుకుని ఏకంగా సర్వీస్ రూల్స్ మార్చే స్తే, ఇకపై ఐఏఎస్లు, ఐపీఎస్లు రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించే పరిస్థితి ఉండదని పరోక్షంగా ఈ పరిణామం కేంద్రం చేతి లో గుత్తాధిపత్యానికి దారి తీస్తుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. మరి ఈ పాతకానికి కారణం ఎవరు? అంటే ప్రశ్నలోనే సమాధానం దొరుకుతుంది.