మొన్న ఏపీకి ప్రత్యేక హోదాపై రాజకీయ వేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి వైసీపీ తప్ప మిగిలిన అన్నిప్రధాన పార్టీల నాయకులు హాజరయ్యారు. చివరకు బీజేపీ నేతలు కూడా వచ్చారు.
టీడీపీతో కలసి వేదిక పంచుకునే అవకాశం ఉన్నందువల్ల వైసీపీ ఈ భేటీకి హాజరుకాలేదు. దీనిపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై స్పందించిన ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు.
రాష్ట్రం కోసం అందరూ కలసి పోరాడాల్సిన సమయంలో జగన్ కలసిరాకపోవడం సరికాదని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉండవల్లి ఏర్పాటు చేసిన సమావేశానికి వైసీపీ ప్రతినిధులను పంపకుండా జగన్ పెద్ద తప్పు చేశారని తమ్మారెడ్డి కామెంట్ చేశారు. జగన్ను ఎవరో తప్పుడు సలహాలు ఇచ్చి చెడగొడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్.. ఈ ముగ్గురే ప్రధాన నేతలని.. వారు తమ ఇగోలు పక్కకు పెట్టి రాష్ట్రం కోసం పోరాడాలని తమ్మారెడ్డి పిలుపు ఇచ్చారు. రాజకీయాలు రాజకీయాలుగా చేసుకోవాలని.. కానీ రాష్ట్ర హక్కుల విషయంలో కలసికట్టుగా పోరాడాలని తమ్మారెడ్డి సూచించారు. ముగ్గురూ కలసి కేంద్రం మెడలు వంచి ఏపీ హక్కులు సాధించాలని భరద్వాజ సలహా ఇస్తున్నారు.