త్వరలో సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటం తో ఇప్పటికే చాలా సర్వేలు తమ ఫలితాలను చెప్పాయి. అయితే ఇప్పుడు మరో సర్వే కూడా జగన్ కే అధికారం ఖాయమని చెబుతుంది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ నియోజకవర్గాలున్నాయి. వీడీపీ అసోసియేట్స్ అంచనాల ప్రకారం.. వచ్చే ఎన్నికల్లో వాటిలో 21 స్థానాలను వైసీపీ గెల్చుకుంటుంది. 45 శాతం ఓట్ షేర్ ను సొంతం చేసుకుంటుంది.
టీడీపీ 37.2 శాతం ఓట్లతో కేవలం నాలుగంటే నాలుగు సీట్లకు పరిమితమవుతుంది. జనసేన వచ్చే ఎన్నికలపై గణనీయమైన ప్రభావం చూపుతుందని సర్వే అంచనా వేసింది. 5.9 శాతం ఓట్లను పవన్ కల్యాణ్ పార్టీ సాధిస్తుందని.. అయితే ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెల్చుకోలేదని స్పష్టం చేసింది. టీడీపీ-జనసేన మధ్య కాపు ఓట్ల చీలిక జరుగుతుందని.. తద్వారా వైసీపీ లాభపడుతుందని అంచనా వేసింది.
ఇక కాంగ్రెస్ 2.2 శాతం ఓట్లు సాధిస్తుందని.. దాని కంటే మెరుగ్గా బీజేపీ 7.13 శాతం ఓట్లను ఖాతాలో వేసుకుంటుందని వెల్లడించింది. లోక్ సభ ఎన్నికల సరళే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగితే టీడీపీ కేవలం 30 సీట్లకు పరిమితమవుతుందని సర్వే అభిప్రాయపడింది. వైసీపీకి 130కి పైగా సీట్లు వస్తాయని అంచనా వేసింది. గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కర్ణాటక తమిళనాడు ఎన్నికల ఫలితాలను వీడీపీ అసోసియేట్స్ పక్కాగా అంచనా వేసిన సంగతి గమనార్హం.