ఏపీలో రాజకీయ సమరం వేడెక్కింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల్లో అసహనం పెరిగిపోతోంది. అధికారం కాపాడుకోవాలని చంద్రబాబు పోరాడుతున్నారు. ఎలాగైనా ఈసారి ఆయన్ను గద్దె దించి సీఎం కావాల్సిందేనని జగన్ పంతంపట్టారు.
అయితే ఈ రాజకీయ పోరాటంలో అగ్రనేతలే సంయమనం కోల్పోతున్నారు. సాక్షాత్తూ పార్టీ అధ్యక్షులే నోరు జారి తిట్ల దండకం అందుకుంటున్నారు. ఈ విషయంలో మొదటగా .. వైసీపీ అధినేత జగన్.. చంద్రబాబును దున్న అంటూ ఎగతాళి చేశారు.
డ్వాక్రా మహిళలను నిలువునా మోసం చేసిన చంద్రబాబును అన్న అనాలా.. దున్న అనాలా అంటూ విరుచుకుపడ్డారు జగన్ ఇటీవల కొన్ని సభల్లో. దాంతో ఏపీ సీఎం చంద్రబాబు కూడా సహనం కోల్పోయినట్టున్నారు. సాధారణంగా తిట్లకు దూరంగా ఉండే ఆయన కూడా జగన్ రూట్ లోనే వెళ్తున్నారు.
డ్వాక్రా మహిళలకు అన్నివిధాలా తాను సాయపడుతున్నానని చంద్రబాబు చెబుతున్నారు. ఇటీవల పసుపు కుంకుమ కింద ఇచ్చిన పదివేలు దేనికైనా ఖర్చు చేసుకోవచ్చని.. తిరిగి కట్టే అవసరం లేదని అంటున్నారు. ఇలాంటి కానుక ఇచ్చిన తనను దున్న అని జగన్ అంటున్నారని.. ఆయన్ను దున్నపోతు అంటే సరిపోతుందా అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి ఇలా అగ్రనేతలు దున్న- దున్నపోతు అంటూ తిట్టుకోవడం మాత్రం బాగాలేదు.