రాజమండ్రి లోక్సభ సభ్యుడిగా కొనసాగుతున్న సీనియర్ సినీనటుడు మురళీ మోహన్కు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు దూరం పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మురళీమోహన్కు వయస్సు పైబడటంతో ఆయన ఎక్కువగా పార్లమెంట్ నియోజకవర్గ కార్యక్రమాల్లో చురుకుగా తిరగలేక పోతున్నారు. వాస్తవానికి 2009, 2014 ఎన్నికల్లో మురళీ మోహన్ రెండు సార్లు ఎంపీగా గెలిచారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అనే ముద్ర ఉండటంతో పార్టీ శ్రేణుల్లోనూ ఆయన్ను ధిక్కరించే వారు తక్కువే అని చెప్పాలి. అయితే గత ఎన్నికల్లో ఆయన లక్షా యాబైవేల మెజార్టీతో గెలిచినప్పటికి ప్రస్తుతం మాత్రం ఆయన తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారట.
చంద్రబాబు చేయించిన సర్వేల్లో ఇది వెల్లడైనట్లు సమాచారం. అంతే కాక మురళీమోహన్పై నేతల నుంచి కూడా ఫిర్యాదులు రావడంతో రాజమండ్రి లోక్సభ సీటు నిర్ణయంపై చంద్రబాబు ఆలోచనలో పడ్డట్లు సమాచారం. అయితే ఆయనకు కాకుండా ఆయన కుటుంబసభ్యుల్లోని ఎవరికో ఒకరికి టికెట్ ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. మురళి మోహన్ కోడలు మాగంటి రూపాదేవికి టికెట్ ఇస్తారని కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే లోక్సభ పరిధి ఎక్కువగా ఉండటం..ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులను సమన్వయం చేసుకుపోలేకపోవచ్చు అనే తదితర కారణాలతో చంద్రబాబు ఆమెను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
ఇక ఇప్పటికే వైసీపీ బీసీ వర్గానికి చెందిన వర్తమాన సినీహీరో మార్గాని భరత్రాం కు టికెట్ కన్ఫర్మ్ చేయడం గమనార్హం. భరత్రాంను ఢీకొట్టాలంటే సామాజిక అంశంతో పాటు ఆర్థిక పరిపుష్టి కలిగిన నేతను బరిలో దింపాలని టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు విన్నవిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే చాలా మంది నేతలు అవంతి ఇంద్రకుమార్ పేరును సూచిస్తున్నారట. ఆయన అయితే అన్ని రకాలుగా బరిలోకి సరిపోతారని చెబుతున్నారట. రాజమండ్రి లోక్సభ పరిధిలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొవ్వూరు నియోజకవర్గం కూడా దీని పరిధిలోకే వస్తుంది. మొత్తంగా ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీడీపీ పటిష్టంగా ఉండటం బరిలో నిలిచే కొత్త అభ్యర్థికి కలిసి వచ్చే అంశంగా శ్రేణులు గుర్తు చేస్తున్నాయి.