రాష్ట్ర రాజకీయాల్లో పులివెందులకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ఎక్కువసార్లు పోటీ చేసి గెలిచారు. సుదీర్ఘకాలం పాటు ఆయన ప్రతిపక్ష నేత హోదాలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. 1955లో పులివెందుల ప్రాంతం నియోజకవర్గంగా ఏర్పడగా 1978 నుంచి వైఎస్ కుటుంబీకులు ఇక్కడి నుంచి పోటీ చేస్తూ గెలుస్తూ వస్తున్నారు. పులివెందులలో వైఎస్ కుటుంబీకులకు తిరుగులేకుండా పోయింది. 1978లో వైఎస్ రాజశేఖర్రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొత్తం వైఎస్సార్ ఇక్కడి నుంచి ఐదుసార్లు ఎన్నిక కాగా..ఆయన కుటుంబ సభ్యులు మరో ఆరు సార్లు ప్రాతినిధ్యం వహించారు.
ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి సతీష్రెడ్డిపై భారీ మెజార్టీతో గెలిచారు. తెలుగుదేశం పార్టీ 1983 స్థాపించబడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్కమారు కూడా ఇక్కడ గెలవలేకపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే వైఎస్ కుటుంబీలకు ఈ నియోజకవర్గం కంచుకోటగా మారింది. నాలుగున్నర దశాబ్దాలుగా పులివెందుల నియోజకవర్గ ఓటర్లు వైఎస్ కుటుంబీకులకే పట్టం కడుతున్నారు. ఈ సారి కూడా పరిస్థితి అలాగే ఉంది. వైఎస్ జగన్ గెలవడం ఖాయమన్నది తేలిపోయిన నిజమేనని..అయితే మెజార్టీ తగ్గవచ్చన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
2014 ఎన్నికల్లో వైఎస్ జగన్ఫై పోటీ చేసి ఓడిపోయిన సతీష్రెడ్డి ఈసారి గట్టిపోటీ ఇవ్వవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబుతో పోట్లాడి మరి ఆయన నియోజకవర్గానికి నిధులు తెచ్చి అభివృద్ధి పనులు జరిగేలా చూశారన్న అభిప్రాయం జనంలో ఉన్న మాట వాస్తవం. అలాగే ఇంటింటికి తాగునీరు అందించడమే లక్ష్యంగా కృష్ణా జలాలలను కూడా తీసుకురావడంలో విజయం సాధించారనే చెప్పాలి. కృష్ణా జలాలలను తీసుకువచ్చేంత వరకు గడ్డం తీయనని శపథం చేసిన సతీష్రెడ్డి...నిజంగానే పని పూర్తి చేశాకే గడ్డం తీయడం విశేషం. వాస్తవానికి సతీష్రెడ్డి సానుభూతి జనంలో ఉంది.
అయితే అవతల ఉన్నది ప్రతిపక్ష హోదాలో ఉన్నది జగన్ కావడంతో సతీష్ రాజకీయ నాయకత్వ మసకబారి పోయి కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే ఈసారి మాత్రం సతీష్ చాలానే ప్రభావం చూపుతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.గెలవకున్న జగన్ మెజార్టీని తగ్గించినా..నిలువరించినా సతీష్ విజయం సాధించినట్లే లెక్క అంటూ రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. చూడాలి పులివెందులలో ట్రాక్ రికార్డ్ కంటిన్యూ అవుతుందా..? రికార్డు బ్రేక్ అవుతుందా..అన్నది.