పెట్టుబడులపై చంద్రబాబునాయుడు పొరబాటున
నోరు జారినట్లున్నారు. ఏదో చెప్పబోయి మనసు ఉన్నదాన్ని బయట పెట్టేసినట్లున్నారు.
ఇంతకీ విషయం ఏమిటంటే ఈమధ్య చంద్రబాబు మాట్లాడుతూ పెట్టుబడులను ప్రస్తావించారు.
ఇప్పటి వరకూ తన వల్లే పెట్టుబడులు వస్తున్నాయని, తనను చూస్తే పారిశ్రామికవేత్తలు
ఏపికి క్యూ కడుతున్నారని కదా చెబుతుంట ? అలాంటి చంద్రబాబే స్వయంగా
పారిశ్రామికవేత్తలు ఏపికి రావటం లేదని నోరుజారారు. అంతేకాకుండా వాళ్ళు ఎందుకు
రావటం లేదో కూడా చెప్పినట్లు చెప్పారు.
ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, 2019 ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాతే ఏపిలో పెట్టుబడులు పెట్టే విషయాన్ని తాను ఆలోచిస్తామని విదేశీ పెట్టుబడిదారులు తనతో అన్నట్లు చంద్రబాబు పొరబాటున చెప్పేశారు. 2019 ఎన్నికల ఫలితాలను బట్టి పెట్టుబడుల విషయాన్ని నిర్ణయించుకుంటామని అంటే అర్ధమేంటి ? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా తాము పెట్టుబడులు పెట్టేది లేదనే కదా అర్ధం ? ఎందుకంటే, చంద్రబాబే అధికారంలో ఉన్నారు. చంద్రబాబే పెట్టుబడుల కోసం తిరుగుతున్నారు.
పెట్టుబడులను ఆకర్షించే పేరుతో ఎన్నో విదేశాలు తిరిగారు. పెట్టుబడుల కోసమే భాగస్వామ్య సదస్సులన్నారు. మరి విదేశాల నుండి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి ? భాగస్వామ్య సదస్సుల ద్వారా ఎన్ని కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నది ఇప్పటికీ సస్పెన్సే. చంద్రబాబు ఏదో కాకిలెక్కలు చెబుతారు. పరిశ్రమల శాఖ, కేంద్ర పరిశ్రమల శాఖ చెప్పే లెక్కలతో చంద్రబాబు లెక్కలకు ఏమాత్రం పొంతనుండదు. అంటే ఏదో అబద్ధాలు చెప్పి నెట్టుకొచ్చేస్తున్నారన్నది అర్ధమవుతోంది.
పెట్టుబడుల కోసమని చంద్రబాబు పెద్ద బృందాన్నేసుకుని దాదాపు 15 దేశాల్లో తిరిగొచ్చారు. మరి కొన్ని దేశాలకు తనకు ఇష్టం వచ్చిన వారిని పంపారు. నాలుగేళ్ళు దావోస్ కు వెళ్ళొచ్చారు. తాజాగా పుత్రరత్నం నారా లోకేష్ ను పంపారు. దాదాపు రూ 100 కోట్లు తగలేసి విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సులు నిర్వహించారు. డబ్బు దండగ తప్ప మరే ఉపయోగం లేదని అర్ధమవుతునే ఉంది. అయినా బుకాయించి బతికేస్తున్నారు.
ఇంతోటి దానికి ఏపిలో పెట్టుబడులు రాకపోవటానికి జగన్మోహన్ రెడ్డే కారణమన్నట్లుగా మాట్లాడుతున్నారు చంద్రబాబు. ఇపుడు మీరున్నారు సరే తర్వాత సంగతేంటని విదేశీ ఇన్వెస్టర్లు తనను అడుగుతున్నట్లుగా చంద్రబాబు ఫోజులు కొడుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరి అదే నిజమైతే పెట్టుబడులు పెట్టమని చంద్రబాబు అడుగుతుంటే 2019 ఎన్నికల్లో ఫలితాలను చూసి నిర్ణయించుకుంటామని విదేశీ పెట్టుబడిదారులు ఎందుకంటున్నట్లు ?