వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు అష్టకష్టాలు పడుతున్నారు. ఏ సర్వే కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని చెప్పకపోవడంతో గెలుపు కోసం ఆయన ఎంతటి సాహసానికైనా వెనుదీయడం లేదు. అందుకే విచ్చలవిడిగా సంక్షేమ పథకాలు ప్రకటించేస్తున్నారు.
అదే సమయంలో టీడీపీ నేతలు కూడా ఓట్ల కోసం దిగజారుతున్నారు. ఇటీవల డ్వాక్రా మహిళలకు పదివేల రూపాయల కానుక ఇచ్చిన టీడీపీ.. దాన్ని ఓట్ల రూపంలో మలచుకునేందుకు తంటాలు పడుతోంది. మహిళలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తోంది.
తమకే ఓట్లు వేయాలని అంటూ స్వయం సహాయ గ్రూపుల మహిళలపై ఒత్తిడి తెస్తున్నారు. ఏపీ మంత్రి చింతకాయ అయ్యన్నపాత్రుడు కొడుకు ఏకంగా మహిళలతో దేవాలయంలో ఒట్లు వేయిస్తున్నాడు. నర్సీపట్నం నియోజకవర్గంలో మంత్రి అయ్యన్నపాత్రుడు రెండో కుమారుడు డ్వాక్రా మహిళలను దేవాలయ ప్రాంగణంలోకి తీసుకువెళ్లి వారితో ప్రమాణం చేయించిన ఘటన కలకలం రేపుతోంది. తెలుగుదేశం పార్టీ ఎంతగా ఓటమి భయాన్ని ఫీలవుతోంది దీంతో అర్థమైపోతోంది.
పసుపు కుంకుమ కింద ప్రభుత్వం డబ్బు ఇస్తోందని.. అందువల్ల వారికి కృతజ్ఞతగా ఓటు వేస్తామని మహిళల చేత దేవుని సాక్షిగా ప్రమాణం చేయిస్తున్నారు. ఈ వీడియోను సాక్షి మీడియా జోరుగా ప్రసారం చేసింది. మంత్రి కుమారుడు గుట్టును రట్టు చేసింది. మరి దీనిపై అధికారపార్టీ ఏమంటుందో..ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.