ఈ మద్య సోషల్ మీడియాలో ఇదిగో తోక అంటే..అదిగో పులి అనే విధంగా పుకార్లు వైరల్ అవుతున్నాయి. సెలబ్రెటీల గురించి అయితే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు..పాజిటీవ్, నెగిటీవ్ ఏదైనా సరే ఇట్టే ప్రచారం జరుగుతుంది. తాజాగా సామాన్య ప్రజల ఖాతాల్లో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం రూ. 25 వేల నుంచి రూ. 15 లక్షల వరకు జమ చేస్తున్నారని పుకార్లు రావడంతో.. పోస్టాఫీసుల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు. బీహార్లోని మోతీహారీ గ్రామంలో జరిగిందీ ఘటన. ఎలా వ్యాపించిందో కానీ మోదీ అందరి ఖాతాల్లోనూ డబ్బులు జమ చేస్తున్నారన్న వదంతి వ్యాపించింది.
గతంలో దిగువ తరగతి ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేస్తారని ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చిందని కానీ ఆ హామీ ఇప్పటి వరకు నెరవేర్చలేదని..ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వారు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఖాతాల్లోనూ రూ. 25 వేల నుంచి రూ. 15 లక్షల వరకు జమ చేస్తోందన్న ప్రచారం జరగడంతో గ్రామస్థులు పోస్టాఫీసుకు పరుగులు తీశారు.
ఖాతాలు తెరిచేందుకు పోటీలు పడ్డారు. మహిళలు, పురుషులు క్యూల్లో గంటల కొద్దీ నిలబడ్డారు. ఈ వార్తలో నిజం లేదని, అదంతా అబద్ధమని చెబుతున్నా ఎవరూ వినిపించుకోలేదు. ఆకలి దప్పులు మరచిపోయి మరీ ఖాతాలు తెరిచేందుకు ఆసక్తి చూపారు. మొత్తానికి ఈ వదంతి సంగతి పక్కనపెడితే, కొత్త ఖాతాలు బోలెడన్ని తెరుచుకోవటం అనేది ప్రయోజనం గా మిగిలిపోయింది అని అధికారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.