చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు నియోజకవర్గంపై సామాన్యజనంతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. టీడీపీకి కంచుకోటగా వర్ధిల్లుతున్న ఈ నియోజకవర్గం నుంచి ఈ సారి సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీఏ సత్య ప్రభ బరిలోకి దిగనున్నారు. ఇదే నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన జంగాలపల్లి శ్రీనివాసులు పోటీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికయితే ఆ పార్టీ నుంచి ఆయన పేరే ప్రముఖంగా వినబడుతుండగా గతంలో ఈప్రాంతంపై బాగా ఆధిపత్యం చెలాయించిన సీకే బాబు కూడా కన్నేసినట్లు సమాచారం. అయితే కొద్దకాలం క్రితం వరకు ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కొద్దిరోజుల క్రితం ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నా..ప్రస్తుతం వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
నియోజకవర్గంలో సుమారు 1 లక్షా 78వేల ఓటర్లు నియోజకవర్గంలో ఉన్నారు. ఇక్కడ కాపు సామాజిక వర్గ ఓటర్లు అధికం. వారే అభ్యర్థి విజయవకాశాలను నిర్ణయిస్తారు. ఈ నేపథ్యంలోనే కాపు సామాజిక వర్గం ఓటర్లను ఆకర్షిచేందుకే అన్ని పార్టీ ల అభ్యర్థులు కాపు వారినే నియమిస్తూ వస్తున్నాయి. ఇక్కడ జనసేన ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంది. అయితే గెలిచే స్థాయలో లేకపోయినా ఓట్లను చీల్చగలదు...విజయవకాశాలను తలకిందులు చేయగలదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. జనసేన నుంచి మనోహర్ పేరు బలంగా వినిపిస్తోంది. ఇక టీడీపీ నుంచి సత్యప్రభ పేరు ఖాయమే. దీనికితోడు ఆమె కుమారుడు శ్రీనివాసులును రాజంపేట ఎంపీగా బరిలోకి దించేందుకు చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిలో ఆమెను ఎట్టి పరిస్థితిలో అభ్యర్థిగా మార్చకపోవచ్చన్నది రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ.
ఇక వైసీపీ నుంచి జంగాలపల్లి శ్రీనివాసులు పేరు ఖాయమే అన్నట్లుగా తెలుస్తున్నప్పటికీ అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. గత ఎన్నికలకు ముందు వరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన శ్రీనివాసులు టికెట్ దక్కకపోవడంతో చివరి నిముషంలో వైసీపీలోకి దూకారు. అయితే అప్పటికే వైసీపీ సమన్వయకర్తగా కొనసాగుతున్న ఏ.ఎస్.మనోహర్ను కాదని శ్రీనివాస్లుకు పార్టీ టికెట్ దక్కింది. అయితే ప్రజలు మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోయారు. దీనికితోడు పవన్కల్యాణ్ టీడీపీకి మద్దతు తెలపడంతో ఓటర్లు సత్యప్రభ వైపు మొగ్గు చూపారు. అయితే ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని శ్రీనివాసులు గట్టి ప్రయత్నం చేసే అవకాశం మెండుగా ఉంది. గతంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా కాస్తో కూస్తో కలసి వస్తుందని ఆశిస్తున్నారు. చూడాలి. మొత్తంగా పోటీ అయితే రసవత్తరంగా సాగనుంది.