ఇటీవల ప్రధాని మోడీ గుంటూరు లో నిర్వహించిన ప్రజా చైతన్య సభలో చేసిన కామెంట్లపై ఏపీ ముఖ్యమంత్రి తనయుడు మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మోడీ పై విమర్శలు చేశారు.
రాష్ట్రాన్ని దారుణంగా మోసం చేశారని బిజెపి పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రం లో పర్యటించిన మోడీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్రానికి అనేక వాగ్దానాలు చేశారని తీరా కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఆంధ్ర రాష్ట్రం పై మొండితనం చూపించారని మోడీ పై విమర్శల వర్షం కురిపించారు.
ముఖ్యంగా గుంటూరు లో జరిగిన భారీ బహిరంగ సభ తెలుగుదేశం పార్టీపై మోడీ చేసిన అవినీతి ఆరోపణలను ఖండించారు లోకేష్ . అంతేకాకుండా టిడిపి అవినీతికి పాల్పడినట్లు ఒక్క రుజువైనా చూపగలరా అని ఆయన ప్రశ్నించారని వార్తలు వచ్చాయి.
ప్రత్యేకహోదా గురించి ఒక్కమాట మాట్లాడలేదని, రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ ఆయనకు గుర్తుకే రావా? అని ఆయన అన్నారు. ప్రధాని సభకు వైకాపా నేతలు జనసమీకరణ చేశారని లోకేశ్ ఆరోపించారు. తనపై అవినీతి వ్యాఖ్యలు చేయడం దారుణమని ఆయన చెప్పారు.విదేశాల్లో చదువుకుని రెండేళ్లు ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం కూడా చేశానని చెప్పారు. ప్రజాసేవ కోసం అన్నీ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని లోకేష్ అంటున్నారు.