చంద్రబాబునాయుడు
వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల తర్వాత
జగన్ కు ఏ రెండో మూడో ఎంపి సీట్లు వచ్చినా తమతో కలిసి రావచ్చన్నారు.
రాష్ట్రప్రయోజనాలను సాధించటమే లక్ష్యంగా పెట్టుకుని జగన్ తమ కూటమిలో కలుస్తానని
అంటే కలుపుకోవటానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు
ఇచ్చిన బంపర్ ఆఫర్ భవిష్యత్తులో మళ్ళీ జగన్ కు దొరక్కపోవచ్చు. కాబట్టి ఆ ఆఫర్
విషయాన్ని జగన్ గట్టిగా ఆలోచిస్తే మంచిదే.
ప్రస్తుతం జగన్ బిజెపితో ఉన్నారని, మొన్నటి మోడి బహిరంగసభ జన సమీకణకు జగనే సహకరించారని చంద్రబాబు చెప్పారు. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే గుడ్డకాల్చి ఎదుటి వాళ్ళమీద పడేయటంలో చంద్రబాబు అండ్ కో సిద్ధహస్తులు. పొద్దున లేచిందగ్గర నుండి చంద్రబాబుకైనా టిడిపి నేతలకైనా ఇదే పని. తలా తోక లేకుండా చంద్రబాబు కావచ్చు లేదా ఇతర టిడిపి వాళ్ళేం మాట్లాడినా అచ్చేయటానికి మద్దతిచ్చే బలమైన మీడియా ఉంది. అందుకే నోటికేదొస్తే అంతా మాట్లాడేస్తుంటారు.
నాలుగేళ్ళపాటు మోడి చంకలో కూర్చున్నది చంద్రబాబు. వ్యక్తిగత ప్రయోజనాలు అందకపోవటంతో ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసింది కూడా చంద్రబాబే. ఎప్పుడైతే తాను బయటకు వచ్చేశారో అప్పటి నుండి మోడి, జగన్ ఒకటే అంటూ జగన్ పై బురద చల్లటం మొదలుపెట్టారు. మొన్నటి బహిరంగసభకు జనసమీకరణలో జగన్ సహకరించారనేది కూడా బురదచల్లటంలో భాగమే అనుకోవాలి.
ఇక చంద్రబాబు మాటలు ఎలాగున్నాయంటే దయతలచి వైసిపి ఖాతాలో ఏ రెండో మూడో ఎంపి సీట్లు ఇస్తున్నట్లుగా ఉంది. ఇప్పటి వరకూ జాతీయ మీడియా చేసిన ప్రతీ సర్వేలోను రాబోయే లోక్ సభ ఎన్నికల్లో వైసిపికి 20 సీట్లంటూ తేల్చేశాయి. అయితే, సర్వేల్లో చెప్పినట్లే జరుగుతాయని కూడా అనుకునేందుకు లేదు. కాకపోతే చంద్రబాబు మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో టిడిపికి 22 ఎంపి సీట్లొచ్చేయబోతున్నట్లు మిగిలిన మూడు సీట్లు మాత్రమే జగన్ కు రాబోతున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. అందుకనే జగన్ మీద దలతలచే తమ కూటమిలోకి రావటానికి ఒప్పుకుంటున్నట్లు చంద్రబాబు పెద్ద ఆఫర్ ఇవ్వటం చూస్తుంటే నవ్వొస్తోంది.