ఎన్నికలు దగ్గరపడుతున్నాయ్. రాష్ట్రంలో రాజకీయ వేడి క్రమంగా పెరుగుతోంది. గెలుపే లక్ష్యంగా నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. అభ్యర్థుల జాబితా అధికారికంగా ప్రకటించకపోయినా.. ప్రధాన పార్టీల్లో పోటీ చేసే వారిపై దాదాపు ఓ క్లారిటీ వచ్చేసింది.
గత పాలనలో హైటెక్ బాట పట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి పూర్తిగా సంక్షేమం, అభివృద్ధినే నమ్ముకున్నారు. తాను చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలో ఓట్లు రాల్చుతాయని గట్టిగా నమ్ముతున్నారు. అన్ని వర్గాల వారికీ ఏదో ఒక లబ్ది కలిగేలా ఆయన పథకాలు చేపట్టారు. చివర్లో మరిన్ని తాయిలాలకు సిద్ధమయ్యారు. వీలైనంత వరకూ అన్ని వర్గాల వారికీ ఎంతోకొంత లబ్ది చేకూర్చేందుకే చంద్రబాబు ప్రయత్నించారు. ఎవరికీ నొప్పి కలిగించకుండా, ఎలాంటి భారం వేయకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో జనం తమవైపే ఉన్నారని టీడీపీ గట్టిగా భావిస్తోంది.
ఇక జగన్ కూడా జోష్ పెంచారు. రోజుకో జిల్లాలో సమర శంఖారావం పూరిస్తున్నారు. జిల్లాలవారీగా పార్టీ నేతలతో సమన్వయం చేసుకుంటున్నారు. చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత, తనపై ఉన్న నమ్మకమే ఈసారి అధికారం తెచ్చిపెడతాయని జగన్ భావిస్తున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ కూడా పార్టీని బలోపేతం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రజల్లోకి రాకపోయినా అంతర్గతంగా రోజూ పార్టీపై దృష్టి పెట్టారు. పలువురిని చేర్చుకోవడం, పలు కమిటీల ఏర్పాటులో ఆయన బిజీగా ఉంటున్నారు.
అయితే అభ్యర్థుల ఎంపికలో మాత్రం టీడీపీ, వైసీపీ ముందుంటున్నాయని చెప్పొచ్చు. పలువురు సిట్టింగులకు సీట్లు ఇచ్చేందుకు టీడీపీ దాదాపు సిద్ధమైంది. వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల స్థానాల్లో కూడా స్థానిక టీడీపీ నేతలను బుజ్జగించి వచ్చినవారికి లేదా వారు సూచించిన వ్యక్తులకు సీట్లు ఇవ్వాలనుకుంటోంది. వైసీపీలో కూడా సిట్టింగులకు సీట్లు పక్కా.! మిగిలిన స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనేదానిపై ఇప్పటికే జగన్ అంతర్గతంగా సంకేతాలిచ్చారు. కొందరిని తన పాదయాత్ర సమయంలో అనౌన్స్ చేసారు. సమర శంఖారావం సభల్లో కూడా ప్రాబ్లమ్ లేని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. దీంతో 10-20 సీట్లు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు దాదాపు సిద్ధమైపోయినట్లే.! పవన్ కల్యాణ్ మాత్రం ఈ అంశంలో వెనుకబడి ఉన్నారని చెప్పొచ్చు.