లోక్-సభ ముగింపు సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ఉత్సాహంగా ప్రసంగించారు. ప్రశంశలు, సెటైర్లు, చమత్కారాలు, మెప్పుకోళ్ళతో ప్రసంగించారు. కాంగ్రెస్ నేత, లోక్సభ లో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేపై ప్రధాని ప్రశంసల జడివాన కురిపించారు. బడ్జెట్ ముగింపు సందర్భంగా లోక్సభలో ఇవాళ మోదీ మాట్లాడారు. లోక్సభలో జరిగిన కొన్ని అంశాలను గుర్తు చేశారు.
ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే సభకు హాజరైన తీరుపట్ల నరేంద్ర మోదీ ప్రశంసలు వ్యక్తం చేశారు. తమ నాయకుడు ఎల్కె అద్వానీ ఎలాగైతే సభకు పూర్తిసమయాన్ని కేటాయించేవారో అదే విధంగా మల్లిఖార్జున ఖర్గే కూడా సభకే అంకితం అయ్యారన్నారు. శాసనసభ్యులు ఇలాంటి సుగుణాలను నేర్చుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధిగా ఖర్గేకు 50ఏళ్లు దాటినా ఆయన సభపట్ల చూపి స్తున్న గౌరవాన్ని తనను తన్మయత్వానికి గురిచేస్తుందని మెచ్చుకున్నారు.
ఇక కాంగ్రెస్ అధ్య్క్షుడు రాహుల్ గాంధీ పై ప్రధాని చురుక్కుమనిపించే చమక్కుల చెణుకులు విసిరారు. పార్లమెంట్ కు మొదటిసారి వచ్చానని, ఇక్కడికి వచ్చాక తనకు కౌగిలింత గురించి తెలిసిందని రాహుల్ కు తగిలేలా సెటర్లు వేశారు. లోక్ సభలో కన్ను కొన్నట్టడం కూడా మొదటిసారి చూసినట్లు రాహుల్ గాంధిని ఉద్దేశిస్తూ చమత్కరించారు. మీడియా కూడా ఆ సంఘటనను ఎంతో సంబరంగా చూపించిందన్నారు.
టీడీపీ ఎంపీ శివప్రసాద్ ను ఉద్దేశిస్తూ, లోక్-సభలో టాలెంట్ ఉన్నసభ్యులకు కొదవలేదన్నారు. 'యూట్యూబ్ వాళ్లు ఆ టాలెంట్' ను వాడుకుంటే బాగుంటుందన్నారు. టీడీపీ ఎంపీ నారమల్లి శివప్రసాద్ వేసిన వేషధారణను కూడా ప్రధాని తన ప్రసంగంలో గుర్తు చేశారు. ఎంపీ శివప్రసాద్ వేసిన పగటి వేషాలను చూస్తే, టెన్షన్లు అన్నీ మాయమై పోయేవన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ, సభలు జరిగిన ప్రతిసారి ఎంపీ శివప్రసాద్ విచిత్ర వేషధారణతో ఆకట్టుకునేవారు.
తమకు మద్దతు ఇచ్చిన ఎస్పీ నేత ములాయం సింగ్ ను కూడా ప్రస్తావిస్తూ ఆయనకు కృతజ్క్షతలు తెలుపుతూ మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు. సభ్యులందరికీ శుభం జరగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. దృఢమైన దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని నిర్మిద్దామని ప్రధాని అన్నారు. ఆ తర్వాత లోక్-సభను నిరవధికంగా వాయిదా వేశారు.