తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగలబోతోందా..? ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరిపోయారు. త్వరలోనా ఆరేడుగురు సిట్టింగులు టీడీపీ నుంచి బయటికొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ అనే చెప్పొచ్చు.
అధికార తెలుగుదేశం పార్టీ ఈసారి సంక్షేమ మంత్రం జపిస్తోంది. తాము చేపట్టిన సంక్షేమ పథకాలే తమను ఈసారి కూడా అధికారంలోకి తెచ్చిపెడ్తాయని గట్టిగా నమ్ముతోంది. అందుకే కోడ్ అమల్లోకి వచ్చే చివరి రోజు వరకూ వరాల వర్షం కురిపిస్తూనే ఉంది. సరిగ్గా ఎన్నికల సమయానికి ఈ పథకాల లబ్ది ప్రజల ఖాతాల్లోకి వెళ్లేలా ప్లానే వేసింది ప్రభుత్వం. అయితే... తెలుగుదేశం పార్టీకి కొంతమంది నేతలు ఇస్తున్న ఝలక్ లు ఆ పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారాయి. ఇటీవలే ప్రభుత్వ విప్, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరారు. తాజాగా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా టీడీపీకి గుడ్ బై చెప్తున్నట్టు ప్రకటించారు.
ఇంతలోనే అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు కూడా టీడీపీ నేతలకు అందుబాటులో లేకుండా పోయారు. ఆయన ఒకటి రెండ్రోజుల్లో ఆయన జగన్ ను కలిసి పార్టీలో చేరే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. భీమిలి నుంచి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న అవంతి శ్రీనివాస్ కు.. ఆ టికెట్ దక్కకపోవడం వల్లే పార్టీ మారుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి ఎంపీగా పోటే చేసే ఛాన్స్ దక్కడం కష్టమేననే వార్తల నేపథ్యంలోనే అవంతి శ్రీనివాస్ విధిలేక పార్టీ మారుతున్నారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. టీడీపీ అంతర్గత సర్వేల్లో ఆయనకు టికెట్ కష్టమేనని తేలినట్లు సమాచారం.
ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే. మరికొన్ని రోజుల్లో ఇంకొంతమంది కాపు సామాజిక వర్గ నేతలు కూడా వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లను తమవైపు లాక్కోగలిగితే విజయం ఖాయమనే నమ్మకం జగన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే పవన్ కల్యాణ్ కాపు ఓట్లను గంపగుత్తగా చీల్చుకుంటారనే ఊహాగానాల నేపథ్యంలో వాటిని తమవైపునకు లాక్కోగలిగితే తప్పకుండా అధికారంలోకి రావచ్చనే అంచనాలు వైసీపీలో ఉన్నాయి. అందుకే వీలైనంత మంది కాపు సామాజిక వర్గ నేతలను పార్టీలే చేర్చుకునేందుకు వ్యూహరచన చేసినట్టు సమాచారం.