నిరాశనిస్పృహలు తారస్థాయికి చేరిన వేళ మన దేహం, మన మనసుపైనే కాదు, మన సర్వేంద్రియాలపై పట్టుకోల్పోవటం సహజం. మనం చేసే ఏ పనిలోనైనా సంస్కారం ఉందంటాం. అదే పని వేరెవరైనా చేస్తే కుసంస్కారం అంటాం. అందుకే మన పెద్దలు తాను చేస్తే సంసారం పరులు చెస్తే వ్యభిచారం అనే నానుడిని ఇలాంటి సందర్భాల్లో గుర్తుచేస్తుంటారు. ప్రధాని నరేంద్ర మోదీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన సంచలన వ్యాఖ్యలుపై విషయాలను ధృవపరుస్తున్నాయి. నిరాశా నిస్పృహలకు సంకేతం మన బాషలో మార్పు. ముఖం లో ప్రస్పుటంగా కనిపించే అసహనం, ఆగ్రహం. ఇక్కడ చంద్రబాబుకు ఆ రెండింటిపై అదుపు తప్పింది.
వాడే పదజాలం చూద్ధాం:
“నరేంద్ర మోదీ నీకు రోజులు దగ్గరపడ్డాయి” “రోజులు లెక్కపెట్టుకో!” అంటూ హెచ్చరించారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన ధర్మాలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “నరేంద్ర మోదీ డిగ్రీ ఎక్కడ చదవారో? కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీ చదువుకోపోవడం వల్లే దేశానికి ఈ గతి పట్టింది” అని ఆరోపించారు.
ఇదే నిజమైతే ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు పనిచేసినప్పుడు, ఇందిరా గాంధి ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన సమయంలోను పాలనాపరంగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణయుగం చవి చూసింది. ఆయన పెద్దగా చదుకోలేదు. అంతెందుకు చంద్రబాబు మంత్రివర్గంలో ఒక మంత్రివర్యులు బికాంలో ఫిజిక్స్ చదివారు. పాలకులకు చదువు ముఖ్యంకాదు. అవిరళకృషి, సమాజంపై సరైన దృక్పధం, అవగాహన అవసరం. పాలనలో సహకరించటానికి ఎక్జిక్యూటివ్ లేదా అధికార వ్యవస్థ అనబడే రాజ్యాంగ వ్యవస్థ ఉంది. వారిని సరిగా ఉపయోగించుకోలేని చంద్రబాబు, మమత లాంటి స్వార్ధపర శక్తులు శాసనవ్యవస్థలో ప్రవేశించి దేశానికి ఈ గతి పట్టించారు? చదువులుండి లాభమేమిటి? అంటున్నారు రాజకీయ విశ్లేషకులు
ఆరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ చదువుకున్నారో? చెప్పగలరని, తాను తిరుపతి వెంకటేశ్వర యూనివర్శిటీలో చదువుకున్నానని చెప్పగలనని కానీ నరేంద్ర మోదీ ఎక్కడ డిగ్రీ చదివారో చెప్పగలరా? అంటూ సవాల్ విసిరారు. నరేంద్ర మోదీ డిగ్రీ ఎక్కడ చదివారో? సూటిగా చెప్పండి అంటూ నిలదీశారు. కానీఎక్కడ చదువుకున్నారో నరేంద్ర మోదీ చెప్పలేరని ఎందుకంటే ఆయన చదవుకోలేదని విమర్శించారు. ప్రధాని ఐదేళ్ల పాలనలో ఆర్థిక రంగం కుదేలైందన్నారు.
నరెంద్ర మోడీ చదువుల గురించి "రైట్ ఆఫ్ ఇంఫర్మేషన్ యాక్ట్" ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుతానికి అసలు అంత అవిద్యావంతుడైన మోడీతో మీరు చట్టాపట్టాల్ వేసుకొని నాలుగేళ్ళు ఎందుకు తిరిగారు? ఆనాడు ఆ ఆలోచన లేని ప్రశ్న ఇప్పుడెందుకు ఉదయించింది? అనాడెప్పుడు మోడీ విద్య గురించి మాట్లాడని మీరిపుడెందుకు మాట్లాడుతున్నారు? మీ ఇద్దరికి చెడితే ప్రజలకు కూడా చెడాలా? అంటే ప్రజలు మీ వెంట తిరిగే గొర్రెలను కుంటున్నారా? అంటున్నాయి ప్రతిపక్షాలు. మీరు కూడా రెండు మూడు ఏళ్ళ క్రితం చికాగో యూనివర్సిటీ నుండి డాక్టరేట్ వచ్చిందన్నారు. తెగ ప్రచారమైంది కదా! మరి దాని సంగతేంది? మీ డాక్టరేట్ ప్రహసంలో దాగిన మర్మం ఏంటి? అని గుర్తుచేస్తున్నారు జనం.
“నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, దేశంలో నిరుద్యోగం పెరిగి పోయిందన్నారు. అంతేకాదు అన్నదాతలు కూడా ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు”
ఈ పాయింట్ మీకే బౌన్స్ బాక్ అవుతుంది. డిమోనెటైజేషన్ ఇంప్లిమెంటేషన్ కమిటీ కన్వీనర్ మీరే కదా! డిమోనెటైజేషన్ మీ ఆలోచనేనని మీరే నాడు ఆ క్రెడిట్ మొత్తం కొట్టేశారు. ఇప్పుడిలా నాలుక మడతేసేశారేంటి? మహానుభావా! బాధ్యత నుండి మీరూ తప్పించుకోలేరు. శాసనసభలో మీ ఉపన్యాసం, బహిరంగసభల్లో మీరు మోడీని తెగ మెచ్చుకొని పొగిడేసిన వందిమాగధుల్లో ప్రధముడిగా నిలిచిన వీడియోలు కోకొల్లలు.
దేశంలో సహకార వ్యవస్థ ఉందా? అని నిలదీశారు. ప్రధాని మోదీకి కనీస పరిపాలన సూత్రాలు కూడా తెలియవు అంటూ ఎద్దేవా చేశారు.
దేశం సంగతి పక్కన పెడదాం. మీ "హెరిటేజ్" అనే ఒక పాలు, పెరుగు, పచ్చడి తో పాటు ఇంకా ఇతర వ్యాపకాలతో పాల పదార్ధాల వ్యాపారంతో చిత్తూరు డైరీ, ప్రజల స్వంతమైన సహకార సంస్థని ముంచేసిన ఘన చరిత్రను వైసిపి, జనసేనలు ఏనాడో బయటపెట్టాయి. ఆ మీ చరిత్ర ఎమిటి? ఒకరి తప్పును మీ చూపుడు వేలుతో చూపిస్తే, మిగిలిన నాలుగు వేళ్ళూ మిమ్మల్నే చూపిస్తాయి.
రాఫేల్ ఒప్పందంలో అనేక అవకతవకలు జరిగాయన్నారు. ప్రధాని మోదీ రోజులు లెక్కపెట్టుకోవాలని త్వరలోనే ఆయన కుర్చీ దిగిపోతారని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ లో దేశంలో విపక్షాల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. మోదీ ఒత్తిడి తట్టుకోలేక ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేశారన్నారు.
రాఫేల్ విషయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీం కోర్ట్), సర్వోన్నత గణాంక పరిశీలన ఆడిట్ వ్యవస్థ (కాగ్) రెండూ ప్రభుత్వానికి క్లీన్-చిట్ ఇచ్చారు. వాళ్ళను వదిలేసి నేషనల్ హెరాల్డ్ కేసులో, బోఫోర్స్ కేసులో మునిగున్న రాహుల్ అండ్ కో — ఓటుకు నోటుకు కేసులో ఒక ప్రజాప్రతినిధికి లంచం యివ్వజూపిన విషయంలో మీ లీలలు బ్రీఫ్డ్-మి వీడియో సమస్థ విశ్వజనీనానికి తెలిసిన జాతి విద్రోహ విషయం. ఈ మీ దుర్మార్గానికి ఆంధ్రప్రదేశ్ జాతి యావత్తు పదేళ్ల పాటు హైదరాబాద్ నగరంపై హక్కును కోల్పోయిన విలువ లక్షల కోట్లలో ఉంటుంది.
ఇది ముఖ్యమంత్రిగా ప్రజల హక్కుల్ని ఫణంగా మీ అధికారాన్ని నిలుపుకున్న దుర్మార్గపు చరిత్ర అని నాడు కేసీఆర్, నేడే కాదు ప్రతిరోజూ వైసిపి అంటుంది. అదే నిలుపుకొని ఉంటే ఈ తాత్కాలిక నిర్మాణాలతో, తాత్కాలిక రాజధాని లో బ్రతకవలసిన అవసరం ఏపి జనానికెందుకు. అసలు కాలం కలసి వస్తే చండీగర్ లాగా ఒక అర్ధశతాబ్ధం ఉచితంగా రాజధానిని వినియోగించుకుంటూ - విశ్వంలోనే అత్యంత ఖరీదైన, విలాసవంతమైన, మహోన్నతమైన అమరావతి నిర్మించుకొని ఉండేవాళ్లం.
మా ఖర్మ కొద్దీ మీదయతో గ్రాఫిక్స్ లో ఊహించుకుంటూ రోజూ పచ్చ పత్రికలు, పచ్చ టివి చానల్స్ చూస్తూ, ఏమీ పూర్తి గాని అమరావతి తో సర్ధుకుంటున్నాం అదనంగా ప్రతి ఈవెంట్ కు వందల, వేల కోట్ల దుబారా భరిస్తూ ఉన్నాం! ఇంకా మీరు మోడీపై నిందలా? అదీ పదికోట్లు మా ధనం ఖర్చుపెట్టి టిడిపి-గాంగ్ తో డిల్లిలో ఉంటూ! మీ మాటలు నమ్మాల్సిన పనిలేదు. అయినా నాలుగేళ్ళు బిజెపితో అంటకాగి సంసారం చేసి మోజు తీరిన బాగస్వామి చంద్రబాబు చెప్పేది నమ్మేదెలా? అంటున్నారు ఆంధ్రులు ఎన్నికల కోసం నిరీక్షిస్తూ!
కేజ్రీవాల్ తన పరిపాలనలో ఢిల్లీలో అద్భుతాలు చేశారని కొనియాడారు. యూపీలో అఖిలేశ్ ను సైతం అడ్డుకున్నారని గుర్తు చేశారు. మోదీ పాలనలో రాష్ట్రాలు ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను కోల్పోయాయని తెలిపారు.
మరి మన రాష్ట్రంలో నరకాసురుడు రాచకన్యలను అపహరించుకు పోయినట్లు ,వైసిపి ఎమెల్యేలను,ఎంపిలను అపహరించుకు పోవటం రాజ్యాంగ విద్రోహం కాదా! ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చెలరేగినప్పుడు ఉద్యమ కారుల వీపు చిట్ల గొట్టి జైళ్ళలో వేసినప్పుడు ప్రజా హక్కులు, స్వేచ్చ బాగున్నట్లా!
అసలు ఎవరినడిగి విభజన ఫలమైన ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక పాకేజీ వదిలేశారు? మీరు ప్రజల ప్రతినిధి మాత్రమే కాని, యజమాని మాత్రం కాదు కదా! గతంలో ఉమ్మడి రాజధాని ప్రయోజనం వదిలేసిన మీకు మోడీని విమర్శించే హక్కెక్కడిది? మీరు అంగీకరించాకే కదా! మోడీ ప్రత్యేక పాకేజి యిచ్చారు - దానికి మీ శాసనసభ తీర్మానాలు కథ-కమామిష్ శాసనసభ రికార్డులు చూసుకోండి. సాక్ష్యం ఉన్నాయి. పలు సన్మానాలు పొందిన ముత్తవరపు వెంకయ్యనాయుడుగారు అంటే ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి నిలువెత్తుసాక్ష్యం . విభజన ఫలాల విషయం లో ఏపికి మోడీ ఏదో మేలే చేశారు. మీరే మాయ చేశారు అంటున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల వారు.
అసలు మీరు మీ కులం కోసమే పని చేశారని ఆ కులమీడియానే నేపధ్యంలో ఉండి పరిపాలన చేసిందని నిన్నటి వరకు మీ సహచర ఎమెల్యే ఆమంచి కృష్ణ మోహన్ అంటున్నారు కదా! అంటే మీకు పాలన అంటే ఒకే ఒక్క కులపాలన అనేనా అర్ధం? అంతెందుకు మీ వలన, మీ మీడియా వలన, మీ సామాజికవర్గం మొత్తం, సమాజానికే దూరమై పోతుందని మీ కులానికే చెందిన ప్రఖ్యాత సినీరచయిత నటుడు పోసాని కృష్ణ మురళి ఆవేదన మీకు తెలియదా! ఇదంతా చూస్తుంటే దొంగే ------పోలీస్ ను-----మరో దొంగతో------- కలసి "దొంగా...దొంగ------అన్నట్లుంది" కదూ! మన నాయకులంతా మీతో కలిపి ఒక్కొక్కడు ప్రజాస్వామ్య హతకుడే కదా! ఒహో! మీ అసహనానికి కారణం మీ ముఖ్యమంత్రి పదవి, మీ కుమారుని మంత్రి పదవి, పోవచ్చేమోననా! దానికి మీ స్వయకృతాపరాధం కారణమని నిర్ధ్వంధంగా చెప్పొచ్చు.
విపక్ష నేతలపై ఐటీ దాడులు జరుపుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మోదీ అప్రజాస్వామ్య పాలన నుంచి విముక్తి కలిగించేందుకే తామంతా ఏకమైనట్లు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఇక్కడ శాసనసభలో విపక్ష నిర్మూలనే కదా! జరిగింది. దానికి చంద్రబాబు సమాధానం చెపుతారా?