భారత దేశంలో గత కొంత కాలంగా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ ఆస్తులు, జవాన్లను టార్గెట్ చేసుకొని పలు దాడులకు పాల్పపడుతున్నారు. ఈ నేపథ్యంలో 35 మంది ప్రయాణిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనంపై నేటి మధ్యాహ్నం ఉగ్రమూకలు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో 18 మంది జవాన్లు అమరులయ్యారు.
సీఆర్పీఎఫ్ 54వ బెటాలియన్కి చెందిన జవాన్లు జమ్ము -శ్రీనగర్ హైవే మార్గంలో ప్రయాణిస్తుండగా ఉగ్రమూకలు ఈ దాడికి పాల్పడ్డాయి. ఇది 2004 తరువాత జరిగిన అతిపెద్ద దాడి అని మిలటరీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా జవాన్లపై దాడి చేసింది తామే అని జైషే మహమ్మద్ సంస్థ ప్రకటించింది. ముందుగా ఐఈడీ బాంబుతో దాడి జరపగా.. అనంతరం తుపాకులతో కాల్పులకు పాల్పడ్డారు. కాగా, పుల్వామా పాఠశాలలో బాంబు పేలుడు ఘటన జరిగిన 24 గంటల వ్యవధిలోనే ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
ఉగ్రచర్య నీచమైనది : మోదీ
జమ్మూకాశీర్ లోని పుల్వామా వద్ద గురువారం సాయంత్రం జరిగిన ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదులది పిరికి పంద చర్య అని..సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఈ దాడిని తుచ్ఛమైన చర్య అని మోదీ పేర్కొన్నారు. సీఆర్పీఎఫ్ జవాన్ల ఆత్మత్యాగం వృథా కాబోదని, మృతవీరుల కుటుంబాలకు యావత్ భారతదేశం అండగా నిలుస్తుందని మోదీ ట్విట్టర్ లో స్పందించారు.
ఉగ్రవాదులకు గట్టి బుద్ది చెబుతాం : అరుణ్ జైట్లీ
నగర్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి జరిగిన ఘటనను కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదులకు పిరికి పందల చర్యలని..ఉగ్రవాదులకు మరిచిపోలేని గుణపాఠం చెబుతామని ఆయన అన్నారు. అమరవీరుల కుటంబాలకు కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.