తెలుగుదేశంపార్టీ
మీద జగన్మోహన్ రెడ్డి, నరేంద్రమోడి కుట్రలు చేస్తున్నారా ? అలాగనే చంద్రబాబునాయుడు
మండిపడుతున్నారు. ఇంతకీ వాళ్ళిద్దరూ టిడిపిపై చేసిన కుట్ర ఏమిటి ? ఏమిటంట, టిడిపి
నుండి ప్రజాప్రతినిధులు వరసబెట్టి రాజీనామా చేస్తున్నారు కదా ? ఇప్పటికి ముగ్గురు
ఎంఎల్ఏలు రావెల కిషోర్ బాబు, మేడా మల్లికార్జునరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్ తో పాటు
ఎంపి అవంతి శ్రీనివాస్ పార్టీతో పాటు పదవులకు కూడా రాజీనామా చేశారు. దాంతో
చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. అందులో నుండి వస్తున్న ఉక్రోషంతోనే జగన్, మోడిలపై
విరుచుకుపడుతున్నారు.
చంద్రబాబు మీద నమ్మకం లేకో లేకపోతే వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాదన్న అనుమానంతోనో వరసగా రాజీనామాలు చేస్తున్నారు. వాస్తవాలు ఇలా వుంటే తన ప్రజా ప్రతినిధులను కాపాడుకోవటంలో విఫలమైన చంద్రబాబు ఆ నెపాన్ని జగన్, మోడిపై వేసేయటం విచిత్రంగా ఉంది. జగన్, మోడి చంద్రబాబు ముగ్గురు ఒకరికొకరు ప్రత్యర్ధులే అన్న విషయం వాస్తవం. ప్రత్యర్ధులన్నాక రాబోయే ఎన్నికల్లో ఎవరి గెలుపుకు అవసరమైన వ్యూహాలు వారికుంటాయి. దాన్ని తనమీద కుట్రగా చంద్రబాబు అభివర్ణించటంలో అర్ధమే లేదు.
జగన్ ను దెబ్బ కొట్టటానికే కదా పోయిన ఎన్నికల్లో మోడి, పవన్ లను చంద్రబాబు కలుపుకున్నది ? అప్పుడు జగన్ మీద చంద్రబాబు కుట్ర చేసినట్లు కాదా ? నాలుగున్నరేళ్ళ చంద్రబాబు పాలనపై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసింది. రాబోయే ఎన్నికల్లో టిడిపి గెలుపుపై ఆ పార్టీ నేతల్లోనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు ప్రకటిస్తున్న ఎన్నికల తాయిలాలు కూడా తమను గట్టెక్కిస్తాయన్న నమ్మకం వారిలో ఉన్నట్లు లేదు.
అందుకనే తమ భవిష్యత్తు కోసం వారు టిడిపికి రాజీనామా చేసేస్తున్నారు. రేపటి ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది జగన్ నే అన్న నమ్మకం వారిలో ఉన్నట్లుంది. అందుకనే మేడా, ఆమంచి, అవంతి వైసిపిలో చేరారు. వారిదారిలోనే ఇంకా కొంతమందున్నట్లు చెబుతున్నారు. పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన 22 మంది ఎంఎల్ఎల్ తో పాటు 3 ముగ్గురు ఎంపిలను ప్రలోభాలకు గురిచేసి చంద్రబాబు ఎలా లాక్కున్నారు.
ఫిరాయింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహించటం ద్వారా జగన్ ను రాజకీయంగా సమాధి చేద్దామని చంద్రబాబు కుట్రపన్నారు. కాకపోతే అంతమంది ప్రజా ప్రతినిధులు వెళ్ళిపోయినా జగన్ బ్యాలెన్స్ కోల్పోలేదు. అది చంద్రబాబు మంటకు కారణంగా కనిపిస్తోంది. ఓ నలుగురు టిడిపికి రాజీనామా చేయగానే గంగవెర్రులెత్తినట్లు మండిపడుతున్న చంద్రబాబు మరో పదిమంది రాజీనామాలు చేస్తే ఏం చేస్తారో ?