టీడీపీని వలసల భయం వెంటాడుతోంది.. ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన విషయం తెలిసిందే...ఇక ఇప్పుడు మరో 15మంది ఎమ్మెల్యేలు..ముగ్గురు ఎంపీలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వస్తున్న వార్తలతో టీడీపీలో కలవరం మొదలైంది. అవంతి శ్రీనివాస్ టీడీపీని విడిచి ..వైసీపీలోకి వెళ్లారు. శ్రీనివాస్ తనతో పాటు అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబును కూడా తీసుకెళ్లేందుకు విఫలయత్నం చేశారంట. అయితే ముందుగానే విషయాన్ని పసిగట్టిన పార్టీ అధిష్ఠానం సదరు ఎంపీకి నచ్చజెప్పి పార్టీలోనే కొనసాగేలా కొన్ని డిమాండ్లకు హామీలిచ్చిందంట. ఇక ఇప్పట్లో అయితే ఆయన వైసీపీ వైపు చూసే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే ఎన్నికల వాతావరణం వేళ..ఎప్పుడు ఏంజరుగుతుందో చెప్పాలేం అని..ఎవరి ప్రయోజనాలు వాళ్లు లెక్కపెట్టుకుని మరీ పార్టీలో ఉండాలా..?! వెళ్లాలా..?! అన్న నిర్ణయాలు తీసుకుంటున్నారని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
టీడీపీలోని ముఖ్య నేతలను లాగేసి...వైసీపీ దెబ్బకొట్టాలని చూస్తోంది. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి నేతల వారీగా జాబితా తెప్పించుకుని మరీ వారికి గాలం వేస్తోందంట. వచ్చేది మా ప్రభుత్వమే ...వచ్చేయండి మా పార్టీలోకి..వీలైతే ప్రజాప్రతినిధి అభ్యర్థిత్వానికి బరిలో ఉందురు...లేదంటే నామినేటేడ్ పదవి అయినా తర్వాత ఇస్తాం...మీకు రాజకీయంగా మంచి హెల్పవుతుంది..ఓడిపోయే ఖర్చులో ఉంటే ఏం లాభం...ఖర్చులు పడటంతో మీకేం మిగలు అంటూ హెచ్చరిక రూపంలోని సూచనలు చేస్తూ వారిని గ్రిప్లోకి తీసుకొచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.
ఇదిలావుంటే, దాదాపు 15 మందికి పైగా ఎమ్మెల్యేలు టీడీపీని వీడబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టిస్తోంది.
ముగ్గురు ఎంపీలూ తమవెంట ఇద్దరేసి ఎమ్మెల్యేలను, వీలైతే ఇంకాస్త ఎక్కువమంది ఎమ్మెల్యేలను ఇతర ముఖ్యనేతల్ని టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకెళ్ళేందుకు ముందస్తుగానే ప్లాన్ రెడీ చేసుకున్న దరిమిలా.. రానున్న రోజుల్లో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ఓ రేంజ్లో కన్పించబోతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుండగా... టీడీపీ మాత్రం కొట్టిపారేస్తోంది.
ఇదిలావుంటే, మరో ఎంపీ కూడా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చే ఆ ఎంపీ, ఈ మధ్యనే వైఎస్సార్సీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డితో సంప్రదింపులు జరిపారట. అలా మొత్తంగా ముగ్గురు ఎంపీలపై వైఎస్సార్సీపీకి ఓ క్లారిటీ వచ్చేసింది. ముగ్గురు కాకపోయినా, ఇద్దరు పక్కా.. అనే ఆలోచనతో, 'ఇద్దరు పార్టీ మారుతున్నారు' అని వైసీపీ ముఖ్యనేత ఒకరు ప్రకటించడం కలకలం రేపుతోంది.