ఏలూరులో వైసిపి
ఆధ్వర్యంలో జరిగిన బిసి గర్జన తర్వాత తెలుగుదేశంపార్టీ ఉలిక్కిపడుతోంది. రాజమండ్రిలో టిడిపి అధ్వర్యంలో జరిగిన జయహో
బిసి తో పోల్చుకుంటే ఏలూరు బిసి గర్జన సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. దాంతో మంత్రులు
యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, కళా వెంకటరావు, అచ్చెన్నాయుడు జగన్ పై
మండిపడుతున్నారు. అధికారంలో ఉండి టిడిపి
ఫెయిలయితే ప్రతిపక్షంలో ఉండి వైసిపి నిజంగా గర్జించిందనే చెప్పాలి.
సరే చంద్రబాబునాయుడు పెట్టినా జగన్మోహన్ రెడ్డి సభలు పెట్టినా రాబోయే ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టటమే టార్గెట్ అనుకోవటంలో సందేహం లేదు. సమాజంలో బిసిల జనాభా దాదాపు సగం ఉంది కాబట్టి ఇద్దరూ పోటీ పడి బిసిలను ఆకట్టుకునేందుకు వరాల మీద వరాలు కురిపిస్తున్నారు.
ఐదేళ్ళు అధికారంలో ఉంది బిసిలకు చేయాల్సినంతగా చంద్రబాబు చేయలేదన్నది వాస్తవం. పోయిన ఎన్నికల్లో ఆచరణసాధ్యం కానీ హామీలిచ్చిన చంద్రబాబు ఆచరణ దగ్గరకు వచ్చేసరికి చేతులెత్తేశారు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో మళ్ళీ అధికారంలోకి రావటమే లక్ష్యంగా చంద్రబాబు మళ్ళీ హామీలనిచ్చి బిసిల మాయ చేయాలని చూస్తున్నారు.
సరే, చంద్రబాబు విషయాన్ని పక్కనపెడితే బిసి గర్జన పేరుతో ఏలూరు బహిరంగసభలో జగన్ కూడా చాలా వాగ్దానాలే గుప్పించారు. జగన్ ఇచ్చిన హామీలు చంద్రబాబు హామీలకు ధీటుగా ఉండటంతో టిడిపిలో ఉలికిపాటు స్పష్టంగా కనబడుతోంది. నేరుగా జగన్ ను ఏమీ అనలేక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పాలనపై మండిపడ్డారు. రెండడుగులు ముందుకేసి తాత వైఎస్ రాజారెడ్డిని కూడా తూర్పారపట్టారు.
మంగంపేట బెరైటీస్ అని, ఫ్యాక్షన్ రాజకీయాలంటూ ఏమిటేమిటో ఆరోపణలు చేశారు. పదవీ కాంక్షతోనే జగన్ హామీలిస్తున్నారని మంత్రులు చెప్పటమే విడ్డూరంగా ఉంది. చంద్రబాబు కాదు జగన్ కాదు ఎవరు హామీలిచ్చినా అధికారం కోసమే అనటంలో సందేహం అవసరం లేదు. మంత్రులు ఏమి మాట్లాడినా, ఏమి ఆరోపణలు చిసినా ఉలికిపాటైతే స్పష్టంగా కనబడుతోంది.