కనీ వినీ ఎరుగని రీతిలో వైస్సార్సీపీ లోకి వలసలు జోరు సాగుతోంది. దీనితో వైసీపీ ఖుషిగా ఉంటె మరో పక్క అధికార పార్టీ జంపింగ్ చేసే ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో ఉంది. టీడీపీకే కాకుండా అధికారం దక్కాలంటే ప్రతి పార్టీకి కీలకంగా మారిన జిల్లా అయిన తూర్పుగోదావరి జిల్లాలో క్రమంగా బలపడే దిశగా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. నేటి ఉదయం ఇదే జిల్లాకు చెందిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు.
ఈ నేపథ్యంలో ఈ జిల్లాకు చెందిన మరింత మంది టీడీపీ నేతలను లాగేయడం ద్వారా అధికార పార్టీని డైలమాలో పడేయాలని వైసీపీ వ్యూహరచన చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యేతో వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నారట. జిల్లాలోనే కాకుండా ఇటు టీడీపీలోనూ కీలక నేతగా ఎదిగిన ఈ నేత... వైసీపీలో చేరేందుకు కూడా దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే ఆయన పెట్టిన ఓ కండీషన్ దానిపై వైసీపీ పునరాలోచన కారణంగానే ఆయన చేరిక ఆలస్యమైనట్లుగా సమాచారం.
అయినా సదరు నేత పెట్టిన కండీషన్ ఏమిటంటే... వైసీపీలోకి వచ్చేందుకు తనకేమీ ఇబ్బంది లేదని అయితే వచ్చే ఎన్నికల్లో తనతో పాటు తన కుమారుడికి కూడా టికెట్ ఇవ్వాలని ఆయన ఓ కొత్త ప్రతిపాదన పెట్టారట. ఆల్రెడీ ప్రజా ప్రతినిధిగా ఉన్న మీ వరకు టికెట్ ఇచ్చే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని ప్రస్తుతం ఆశావహుల సంఖ్య అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో రెండు టికెట్లు అంటే కష్టమేనని కూడా వైసీపీ దాదాపుగా తేల్చి చెప్పిందట. అయితే ఈ మాటతో సదరు నేత పెద్దగా నిరాశ చెందలేదని ఇంకా వైసీపీ నేతలతో టచ్ లోనే ఉన్నారని సమాచారం.