టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలు వస్తున్న క్రమంలో రాష్ట్రంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ మరోపక్క పార్టీకి సంబంధించిన నాయకులను కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే టెలీ కాన్ఫరెన్స్ లో పార్టీకి సంబంధించిన నాయకులతో మాట్లాడుతూ కార్యకర్తలను ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు చంద్రబాబు.
ఇదిలా ఉండగా ఇటీవల గుంటూరు జిల్లాలో కొండవీడు ఉత్సవాల సభలో పాల్గొన్న చంద్రబాబు ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ పార్టీలు మారిన నేతలను ప్రజలు నిలదీయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆ నేతలు తమకు పదవులు రావన్న భయంతోనే పార్టీలు మారుతున్నారని విమర్శించారు. నిత్యం ప్రజల్లో ఉండేవారికే తమ పార్టీ టికెట్లు ఇస్తామని మరోసారి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ, టీఆర్ఎస్, వైసీపీపై ఆయన నిప్పులు చెరిగారు. మోదీ మరోసారి రాష్ట్ర విభజన గాయాలను రేపుతున్నారని, నవ్యాంధ్ర అభివృద్ధికి టీఆర్ఎస్ అడ్డుపడుతోందని ఆరోపించారు. వైసీపీకి టీఆర్ఎస్ లోపాయికారి మద్దతు ఇస్తోందని విమర్శించారు.
ప్రజలంతా గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెబుతారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయాలు తీసుకుంటుందని రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజాభిప్రాయం మేరకే టికెట్ల కేటాయింపు ఉంటుందని కరాఖండిగా చెప్పేశారు చంద్రబాబు.