నెల్లూరు లోక్సభ టీడీపీ అభ్యర్థిపై రకరకాల ఊహాగానాలు నడుస్తుండగా తాజాగా మరోపేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనెవరో కాదు జివి కృష్ణరెడ్డి కుమారుడు, టి. సుబ్బిరామిరెడ్డికి స్వయాన అల్లుడు అయిన సంజయ్రెడ్డి. గత కొంతకాలంగా సంజయ్రెడ్డి నెల్లూరు జిల్లాలో సేవా కార్యక్రమాలు విస`తంగా చేపడుతున్నారు. అయినా ఆయనకు రావాల్సినంత పేరు మాత్రం రాలేదనే చెప్పాలి. ఇప్పుడు ఆయన్ను ఎంపీగా చేసి పార్లమెంటులో కూర్చోబెట్టాలని సుబ్బిరామిరెడ్డి ఆశపడుతున్నారట. వాస్తవానికి ఈ స్థానం నుంచి చాలా మంది పేర్లు వినిపిస్తూ వస్తున్నాయి. అందులో ప్రముఖంగా మొదట ఆదాల ప్రభాకర్రెడ్డి పేరు వినబడగా, ఆయన్ను నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం నుంచి బరిలో దిగాలని చంద్రబాబు ఆదేశించారట. దీంతో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయకపోవచ్చన్నది టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఇక మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఇక జడ్పీ చైర్మన్ బమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి కూడా బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసేందుకు వీరెవ్వరూ సరిపోరని..కావాలనే ఎమ్మెల్సీ రవిచంద్రయాన్ లీకులు వదులుతున్నారనే ఆరోపణలు టీడీపీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.
లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే వారెవ్వరూ సంజయ్రెడ్డి పేరును వ్యతిరేకించకపోవడం కొసమెరుపు. ఎందుకంటే ఆయనయితే తమకు ఖర్చు భయం ఉండదని..దాదాపు ఖర్చంతా ఆయన భరిస్తాడని వారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఆయన పేరు చెప్పడానికి మాత్రం వారు ఇష్టపడటం లేదట. ఎందుకంటే చివరి నిముషం వరకు పరిణమాల్లో మార్పుకు అవకాశం ఉంటుందని కొంత వారు సంయమనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ వర్గాలు మాత్రం సంజయ్రెడ్డి పోటీ చేస్తే పెద్దగా ఇబ్బంది లేకుండానే పార్టీ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులే ఒకే చేస్తుండటంతో ఇక సంజయ్రెడ్డి ఎంపీగా పోటీ చేయడం లాంఛనమేనని తెలుస్తోంది. వాస్తవానికి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్సభ అభ్యర్థిగా సుబ్బిరామిరెడ్డి పోటీ చేశారు. కనీసం ఆయనకు డిపాజిట్ కూడా దక్కలేదు. అప్పటి పరిస్థితులు ప్రభావం అలా ఉండటమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈసారి కాంగ్రెస్ టీడీపీ మధ్య పొత్తు కుదరితే తానే స్వయంగా పోటీ చేయాలని భావించారట. అయితే పొత్తు కుదరకపోవడంతో సుధీర్ఘకాలంగా కాంగ్రెస్తో ఉన్న అనుబంధం దరిమిలా ఆయన ఆ పార్టీలోనే కొనసాగుతూ అల్లుడిని టీడీపీ నుంచి పోటీ చేయించాలని యోచిస్తున్నట్లు సమాచారం. సో ఇలా ముందు అల్లుడిని పెట్టి.. తెరవెనుక అంతా సుబ్బిరామిరెడ్డి నడిపిస్తారన్నమాట.