తెలంగాణాలో ఎన్నికలు ముగిసి, ప్రభుత్వం కొలువుదీరిన దాదాపు రెండు మాసాలకు కేబినెట్ను విస్తరించారు సీఎం కేసీ ఆర్. అయితే, అనూహ్యంగా ఈ కేబినెట్లో ఆయన కుటుంబంలోని ఇద్దరికీ హ్యాండిచ్చారు. గత ప్రభుత్వంలో కుమారుడు కేటీఆర్,మేనల్లుడు హరీష్ రావులకు ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్.. ఇప్పుడు చాలా తక్కువ సంఖ్యలోనే మంత్రులను ఎంపిక చేసుకున్నారు. వీరిద్దరినీ పక్కన పెట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ వ్యూహం ఏంటనేది ఆసక్తిగా మారింది. అలాగే, మాజీ మంత్రుల్లో జోగు రామన్న, పద్మారావుగౌడ్, కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి, నాయిని నర్సింహారెడ్డికి కూడా చోటు లభించలేదు. దీనికి కారణాలపై రాజకీయ వర్గాల్లో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న కేబినెట్లో 10 మందికి సీఎం కేసీఆర్ తన కేబినెట్లో చోటు కల్పించబోతున్నారు. జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, చామకూర మల్లారెడ్డి వంటి వారు కేబినెట్లో స్థానం పొం దారు. వీరిలో ఈటల, జగదీశ్ రెడ్డి, తలసాని, అల్లోల మాత్రమే టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. మిగిలిన ఆరుగురూ కొత్తవారే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబరు 11న వెలువడగా, అదే నెల 13న సీఎంగా కేసీఆర్, మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
వాస్తవానికి తెలంగాణ కేబినెట్లో మొత్తం సీఎంతో కలిపి 30 మందికి అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎంలు భర్తీ కావడంతో ఇప్పుడు పదిమందికి అవకాశం కల్పించినా.. మరో 16 మందిని కేబినెట్లోకి తీసుకోవచ్చు. రెండు నెలలు గా కేబినెట్ విస్తరణపై రకరకాల ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు తొలి విడత ముహూర్తాన్ని కేసీఆర్ ఖరారు చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత మరో ఆరుగురికి అవకాశమివ్వొచ్చని, అప్పుడు పూర్తి కేబినెట్ కొలువు దీరుతుం దని సమాచారం. కాగా, కేసీఆర్ కేబినెట్లో మరోసారి మహిళలకు అవకాశం కల్పించకపోవడం చర్చనీయాంశమైంది.
సరే, ఈ విషయం పక్కన పెడితే.. గతంలో మంత్రులుగా చేసిన లేదా కేసీఆర్కు కీలకమైన నాయకులకు కూడా కేబి నెట్లో బెర్త్ లభించలేదు. దీంతో దీనిపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా హరీష్రావు పరిస్థితి ఏంటి? అనేది చర్చకు వస్తోంది. సిద్దిపేట నియోజకవర్గం నుంచి లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు హరీష్రావు. అయితే, ఈయనకు కేబినెట్లో బెర్త్ లభించలేదు. వాస్తవానికి రాష్ట్రంలో ఇంత భారీ మెజారిటీ లభించిన ఏకైక ఎమ్మెల్యేగా హరీష్ రికార్డు సృష్టించారు. దీంతో కీలకమైన పదవి లభిస్తుందని భావించారు. అయితే, ఈయనకు కేబినెట్లో బెర్త్ లభించలేదు. ఇక, కేసీఆర్ తనయుడు కేటీఆర్ కు కూడా కేబినెట్లో పదవి లభించలేదు.
పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు గా కేటీఆర్ నియమితులు కావడంతో ఈయనకు అవకాశం లభించలేదు. అయితే, అదేసమయంలో హరీష్ను వచ్చే ఎన్నికల్లో పార్లమెంటుకు నిలబెడతారని ప్రచారం సాగుతోంది. అదేసమయంలో ఇప్పుడు కేబినెట్లో బెర్త్రాని వారిలో చాలా మందిని పార్లమెంటుకు పోటీ చేయిస్తారని అంటున్నారు. దీంతో తెలంగాణ కేబినెట్లో సీటు ఆశించి భంగ పడిన వారు తాము ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
మాజీ మంత్రుల్లో జోగు రామన్న, పద్మారావుగౌడ్, కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి, నాయిని నర్సింహా రెడ్డికి కూడా చోటు లభించలేదు.
వారిలో కడియం, పద్మారావు గౌడ్, లక్ష్మారెడ్డిలను కూడా ఎంపీ బరిలో నిలిపే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. అదేసమయంలో పార్లమెంటు ఎన్నికల తర్వాత కూడా మరోసారి కేబినెట్ విస్తరించే ఆలోచన ఉన్నట్టు సమాచారం. పార్లమెంటు ఎన్నికల తర్వాత మరోసారి విస్తరించడం ద్వారా కేబినెట్నుసమన్వయం చేసుకోవచ్చని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.