ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాజకీయ నాయకుల నుంచి సినీ స్టార్స్ వరకు జగన్ తో భేటీ అవుతున్నారు. అయితే ఇప్పడూ ఈ జాబితాలోకి కింగ్ నాగార్జున చేరడం విశేషం. జగన్ నివాసానికి వెళ్లిన నాగార్జున దాదాపు అరగంట సేపు సమావేశం అయినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశం సందర్భంగా ఏ విషయం గురించి చర్చించారనే అంశంపై స్పష్టతలేదు. జగన్ తో సమావేశం అనంతరం నాగార్జున మీడియాతో ఏమీ మాట్లాడకుండానే అక్కడ నుంచి వెళ్లిపోవడం గమనార్హం.
కేవలం మర్యాదపూర్వకంగానే జగన్ తో నాగార్జున సమావేశం అయినట్టుగా చెబుతున్నారు. మరోవైపు నాగార్జున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నాడనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇవి ఊహాగానాలు మాత్రమే. ప్రత్యక్ష రాజకీయాల వైపు వచ్చే ఆసక్తి నాగార్జునకు ఉందా? అనేది అనుమానమే.
ఇటీవలే నటుడు మంచు విష్ణు కూడా సతీసమేతంగా వచ్చి జగన్ తో భేటీ అయ్యారు. అయితే విష్ణు భార్య జగన్ కు ఎలాగూ చిన్నాన్న కూతురే కాబట్టి.. అందులో రాజకీయ ప్రసక్తి ఉండకపోవచ్చు. ఇక నిన్న జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు కూడా జగన్ తో భేటీ అయ్యారు. అది కూడా ‘మర్యాదపూర్వకమే’ అనేమాట వినిపించింది. ఏదేమైనా ఎన్నికల ముందు ఇటువంటి భేటీలో రాజకీయ వర్గాల్లో హీట్ ను మరింత పెంచేస్తున్నాయి.