తెలంగాణ సీఎం కేసీఆర్ తెలుగు మీడియాకు ఝలక్ ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణపై ఆయన మీడియా అంచనాలను తలకిందులు చేశారు. ప్రత్యేకించి పత్రికలలో వచ్చిన విధంగా ఆర్దిక శాఖను నిరంజన్ రెడ్డికి ఇవ్వలేదు. ఈ విషయంలో ప్రధాన ప్రింట్ మీడియా అంతా తప్పులో కాలేసింది.
అత్యధిక సర్క్యలేషన్ ఉన్న పత్రిక ఏకంగా .. ఆర్థిక మంత్రిగా నిరంజన్ రెడ్డి అని బ్యానర్ ప్రచురించేసింది. కానీ సాయంత్రం కేసీఆర్ శాఖల కేటాయింపు చూస్తే అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. అసలు మీడియా ఊహించిన శాఖల్లో దాదాపు ముప్పావువంతు తప్పుడు అంచనాలే కావడం విశేషం.
కొప్పుల ఈశ్వర్కు సంక్షేమశాఖలు కేటాయించగా, మరో సీనియర్ నేత ఇంద్రకరణ్రెడ్డికి న్యాయ, అటవీ, దేవాదాయశాఖలు అలాట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రిగా వ్యవమరించిన ఈటల రాజేందర్కు ఈసారి వైద్యారోగ్యశాఖ దక్కగా.. గతంలో విద్యుత్శాఖ మంత్రిగా వ్యవహరించిన జగదీశ్రెడ్డికి ఈసారి విద్యాశాఖ లభించింది.
గత హయంలోనూ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్కు పశుసంవర్థకశాఖ కేటాయించారు. నిరంజన్రెడ్డికి వ్యవసాయ శాఖ, ఎర్రబెల్లి దయాకర్రావుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు, ప్రశాంత్రెడ్డికి రోడ్లు-భవనాలు, రవాణాశాఖలు కేటాయించారు. మేడ్చల్ మల్లారెడ్డికి కార్మిక శాఖ దక్కగా.. శ్రీనివాస్గౌడ్కు ఎక్సైజ్, పర్యాటక శాఖలు లభించాయి. సో.. కేసీఆర్ మీడియా అంచనాలను పూర్తిగా తలకిందులు చేశారన్నమాట.