పై హెడ్డింగ్ చూశారు కదా
? తెలుగుదేశంపార్టీ నుండి ప్రజా ప్రతినిధులు రాజీనామా చేసి వైసిపిలో చేరుతుండటంతో
శ్రేణుల్లో బాగా నిరుత్సాహం కనబడుతోంది. నిజంగా నేతల మొరేల్ దెబ్బతినటమనే
చెప్పాలి. అందుకనే చంద్రబాబు కూడా నేతల టెలికాన్ఫరెన్సులో జగన్మోహన్ రెడ్డిని
నోటికొచ్చినట్లు తిడుతున్నారు. చంద్రబాబులో టెన్షన్ చూసిన నేతల్లో అయోమయం మరింత
పెరిగిపోతోంది.
నేతల మొరేల్ దెబ్బతినకుండా, నిరుత్సాహం నింపేందుకా ? అన్నట్లుగా చంద్రబాబుకు మద్దతుగా నిలిచే మీడియా పెట్టిన బ్యానర్ హెడ్డింగ్ ఇది. హెడ్డింగ్ సారంసమేమిటంటే, రాబోయే ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేయటానికి నేతలు క్యూలు కడుతున్నారట. టికెట్ల కోసం సిఎం చంద్రబాబుకు వినతులు వెల్లువలా వచ్చి పడుతున్నాయట. చర్చలు, సర్దుబాట్లలో చంద్రబాబు బిజీగా ఉంటున్నారట.
అలాగని చెబుతూనే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోనని తోట నర్సింహం చెప్పారని, నెల్లూరు ఎంపిపై స్పష్టత కోరిన బీద బ్రదర్స్ అంటూ మరికొన్ని డెక్కులు కూడా ఇచ్చారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నిజంగానే టికెట్ల కోసం అంతగా వినతులు వెల్లువ వస్తుంటే మరి ఎంఎల్ఏలు, ఎంపిలు ఎందుకు పార్టీని వదిలేస్తున్నట్లు ? జనాల్లో టిడిపికి బ్రహ్మాండంగా ఆదరణ ఉంటే ప్రజా ప్రతినిధులు, నేతలు టిడిపిని వదిలేవారే కాదన్న విషయాన్ని సదరు మీడియా మరుగునపడేసింది.
టికెట్ల విషయంలో నేతలతో చర్చలు, సర్దుబాట్లతో బిజీగా గడిపేస్తున్నారని మరో చెణుకు విసిరింది. లోక్ సభకు పోటీ చేయటానికి చాలామంది ఎంపిలు సుముఖంగా లేరన్నది వాస్తవాన్ని మీడియా దాచిపెట్టింది. నేతలతో సర్దుబాట్లు, చర్చలు జరుపుతున్నారు సరే. మరి దాని ఫలితాలేవి. ఒక్క జమ్మలమడుగు పంచాయితీ సెట్ చేయటానికే చంద్రబాబుకు దాదాపు నాలుగేళ్ళు పట్టింది. జమ్మలమడుగు లాంటి పంచాయితీలున్న నియోజకవర్గాలు చాలా ఉన్నాయి.
చాలా కాలంగా పంచాయితీలు జరుగుతున్న నియోజకవర్గాల్లో జమ్మలమడుగు తప్ప మరో పంచాయితీ ఇంతవరకూ చంద్రబాబు పరిష్కరించలేకపోయారు. షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నా నేతల పంచాయితీలు పరిష్కారం కాలేదంటే అర్ధమేంటి ? పాపం టిడిపికి జాకీలేసి లేపాలని చంద్రబాబు మీడియా ఎంతగా తాపత్రయపడుతోందో ?