ముకేశ్ అంబానీ సోదరుడు, ఆర్.కామ్ చైర్మన్ అనిల్ అంబానీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అడాగ్ (అనిల్ ధీరూభాయి అంబానీ గ్రూప్) ఛైర్మెన్ అనిల్ అంబానీ, స్వీడన్కు చెందిన టెలికం ఉపకరణాల సంస్థ ఎరిక్సన్ వివాదంలో భారీ షాక్ తగిలింది. ఎరిక్సన్ సంస్థకు ₹450 కోట్లు చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ డబ్బులను చెల్లించకపోతే మూడు నెలలపాటు జైలుశిక్ష అనుభవించాలని సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.
ఎరిక్సన్ కంపెనీకి రూ. 453 కోట్లను నాలుగు వారాల్లో చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అనిల్ అంబానీ కోర్టు ధిక్కారానికి పాల్పడి నందుకుగాను అపరాధ రుసుము కోటి రూపాయిలు చెల్లించాలని ఆదేశించింది. ఎరిక్సన్ కంపెనీ అనిల్ అంబానీ కంపెనీపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపి బుధవారం నాడు అంబానీకి షాక్ కలిగేలా తీర్పును వెలువరించింది.
ఎరిక్సన్ కంపెనీకి గత ఏడాది డిసెంబర్ 15వ తేదీ నాటికి బకాయిలను చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను గత ఏడాది అక్టోబర్ 28వ తేదీన వెలువరించింది అంతేకాదు ఆలస్యంగా ఈ మొత్తాన్ని చెల్లిస్తే ఏడాదికి 12 శాతం వడ్డీని కలిపి ఇవ్వాలని కూడ సుప్రీం ఆదేశించింది.
తమకు చెల్లించాల్సిన ₹ 550 కోట్లను చెల్లించకుండా అనిల్ అంబానీ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఎరిక్సన్ సంస్థ ఆరోపించింది. తమకు చెల్లించాల్సిన నిధులను చెల్లించక పోవడంతో ఎరిక్సన్ సంస్థ సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు ఈ మేరకు బుధవారం నాడు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.ఎఫ్.నారీమన్, జస్టిస్ వినీత్ సహరన్ లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించి ఉత్తర్వులను జారీ చేసింది.
అలాగే రిలయన్స్ టెలికం చైర్మన్ సతీష్ సేత్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ చైర్పర్సన్ ఛాయా విరానీలు కోటి రూపాయిల చొప్పున అపరాధ రుసుం చెల్లించాలని పేర్కొంది. నాలుగు వారాల్లోపు ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయకపోతే నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాలని హెచ్చరించింది. కేవలం క్షమాపణలు చెబితే సరిపోదని ఆర్.కామ్కు సుప్రీం మొట్టికాయలేసింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనకు తగిన మూల్యం చెల్లించాలని వ్యాఖ్యానించింది. మరోవైపు అనిల్ అంబానీని అరెస్ట్ చేయాలన్న ఎరిక్సన్ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది.
‘వారి వద్ద రఫేల్ కోసం డబ్బులు ఉంటాయి. ప్రతిష్ఠాత్మకమైన ప్రతి ప్రాజెక్టులో భాగస్వామి కావడానికి వారి వద్ద డబ్బు ఉంటుంది. మాకు చెల్లించడానికి మాత్రం ఉండదు. న్యాయస్థానం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి’ అని ఎరిక్సన్ తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. అనిల్ అంబానీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.