పార్టీ పరిస్ధితి మీద,
సిట్టింగుల విషయంలో చంద్రబాబునాయుడు చేయించుకుంటున్న సర్వేల సంగతి అందిరికీ
తెలిసిందే. అయితే, తెలుగుదేశంపార్టీలో తాజాగా రివర్సు సర్వేలు జరుగుతున్నాయట.
అందుకే ఎంఎల్ఏలు, ఎంపిలు టిడిపిని వదిలేస్తున్నట్లు సమాచారం. ఈ రివర్స్ సర్వేల
గోలేంటనుకుంటున్నారా ? రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరిస్ధితిపైనే కాకుండా చంద్రబాబు
మీద జనాల అభిప్రాయంపై కొందరు టిడిపి ప్రజా ప్రతినిధులు సర్వేలు చేయించుకున్నారట.
సర్వేల్లో వచ్చిన ఫలితాలను చూసిన తర్వాతే చాలామంది టిడిపిని వదిలేయాలని నిర్ణయించుకున్నారని
సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఎంఎల్ఏలు, ఎంపిలు ప్రభుత్వంపై జనాల్లో ఉన్న అభిప్రాయాలేంటి ? చంద్రబాబు పనితీరు మీద జనాలభిప్రాయం ఎలాగుంది అనే అంశాలపై సర్వేలు చేయించుకున్నారట. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన కూడా సర్వేలు చేయించుకున్నారట. పాదయాత్రలో జగన్ విషయంలో జన స్పందన పైన కూడా సర్వేలు చేయించుకున్నారట.
ఆ సర్వేల్లో చాలామంది చంద్రబాబు మీద తీవ్రస్ధాయిలో మండిపడ్డారట. పెరిగిపోయిన అవినీతి, కులగజ్జి, వ్యవస్ధలను నిర్వీర్యం చేయటం లాంటి అంశాలపై జనాలు బాగా నెగిటివ్ అభిప్రాయాలు వ్యక్తం చేశారట. అదే సమయంలో మెజారిటీ జనాలు జగన్ వైపు మొగ్గుచూపారట. దాంతో రాబోయే ఎన్నికల్లో టిడిపి గెలవదని, తెలుగుదేశంపార్టీ తరపున పోటీ చేసినా తాము గెలిచే అవకాశాలు లేవని చాలామంది నిర్ధారణకు వచ్చారని సమాచారం.
ఇప్పటి వరకూ ‘మీ అందరి జాతకాలు తన వద్ద ఉన్నా’యంటూ చంద్రబాబు బెదిరించటమే చూశారు. అలాంటిది పలువురు ప్రజా ప్రతినిధులు సైలెంట్ గా తమ నియోజకవర్గాల్లో సర్వేలు చేయించుకుని టిడిపికి రాజీనామాలు చేసేస్తున్నారు. ఎంఎల్ఏలు మేడా మల్లికార్జున రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, ఎంపిలు అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్ర రాజీనామాలు అందులో భాగమేనట.
మొన్ననే పార్టీలో చేరిన దాసరి జై రమేష్ పార్టీ పరిస్ధితిపై తమ నియోజకవర్గాల్లో పూర్తి ఆరా తీశారు. ఎక్కడ కూడా చంద్రబాబు పాలనపై సానుకూల స్పందన రాలేదట. దాంతో టిడిపిలో ఉండటం అనవసరమని భావించినట్లు సమాచారం. అందుకనే వెంటనే టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరిపోయారు. రేపటి ఎన్నికల్లో విజయవాడ లోక్ సభ అభ్యర్ధిగా దాసరి పేరు ప్రచారంలో ఉన్న విషయం అందరూ చూస్తున్నదే. ఇదే పద్దతిలో చాలామంది టిడిపిని వీడటానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అంటే రాబోయే ఎన్నికల్లో టిడిపి పరిస్ధితిపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అర్ధమైపోతోంది.