భారత దేశంలో ఎన్నికల హడావుడి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు పార్టీ నాయకులు తమ మందీమార్బలం కన్నా దైవశక్తినే ఎక్కువ నమ్ముకుంటున్నారు. ఇక భారత దేశంలో అత్యంత పవర్ ఫుల్ భగవంతుడిగా చెప్పుకునే తిరుమలేశుడి దర్శనం కోసం క్యూలు కడుతున్నారు. సాధారణంగా తమ పనులు విజయవంతంగా పూర్తి కావాలని సినీ, రాజకీయ నాయకుడు శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీ పర్యటనలో భాగంగా తిరుపతి చేరుకొని, అలిపిరిలో మెట్ల మార్గం ద్వారా కాలినడక బయలు దేరి శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుపతిలో ఈరోజు సాయంత్రం జరగనున్న ప్రత్యేక హోదా భరోసా యాత్రలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో 11.30 గంటలకు రాహుల్ రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కాగా, రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు విమానాశ్రయం వద్ద భారీ ఏర్పాట్లు చేశారు.రాహుల్ పర్యటన తర్వాత ఏపీ ప్రజలకి కాంగ్రెస్ మీద విశ్వాసం పెరిగే అవకాశం వుందని, ఓటు బ్యాంకు పెరిగే అవకాశం కూడా ఉంటుందని ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా విశ్వసిస్తున్నారు. మరి రాహుల్ పర్యటన కాంగ్రెస్ పార్టీకి ఎంత వరకు లాభిస్తుంది అనేది చూడాలి.