పాపం.. నందమూరి బాలకృష్ణకు టైమ్ బావున్నట్టు లేదు. ఇప్పటికే ఎన్టీఆర్ కథానాయకుడు ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టింది.. సినిమా ఫరవాలేదన్నట్టు టాక్ వచ్చినా కలెక్షన్లు నిరాశపరిచాయి. ఇక మహానాయకుడు డిజాస్టర్ టాక్ తెచ్చుకుంటోంది.
ఈ సమయంలో ఆయనకు కోర్టు నోటీసులు రావడం మరో తలనొప్పిగా మారింది. నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంపిణీ చేసిన బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఈ కేసు తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగంగా డబ్బులు పంపిణీ చేసిన బాలకృష్ణపై ప్రజా ప్రాతినిధ్య చట్ట నిబంధనల కింద కేసు నమోదు చేసేలా ఎన్నికల అధికారులను ఆదేశించాలని కోరుతూ కె.శివకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఏదో ఎన్నికల ప్రచారం ఉత్సాహంలో జనంపైకి నోట్లు విసిరి ఉత్సాహపరిచిన బాలయ్య ఇప్పుడు తలపట్టుకుంటున్నారు. ఎన్నికల నిబంధనలపై అవగాహన లేకపోవడం.. అభిమానులను చూసి తెచ్చుకున్న అత్యుత్సాహం ఇప్పుడు ఆయన్ను ఇరుకున పెడుతున్నాయి. మరి ఈ కేసులో తుది తీర్పు ఎలా వస్తుందో చూడాలి.