అమలాపురం లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరుగురు ఎంఎల్ఏల్లో
టెన్షన్ పెరిగిపోతోంది. జిల్లాల వారీగా, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా
చంద్రబాబునాయుడు సమీక్షలు నిర్వహిస్తు అసెంబ్లీ అభ్యర్ధులను ఖరారు చేస్తున్న విషయం
తెలిసిందే. దాంతో అమలాపురం లోక్ సభ సీటు విషయానికి వచ్చేసరికి ఆరుగురు సిట్టింగుల్లో
టెన్షన్ పెరిగిపోతోందట. ఎందుకంటే, వారిపై పార్టీలోను బయట అంతలా వ్యతిరేకత బాహాటంగానే
కనబడుతోంది. దానికి తోడు చంద్రబాబు చేయించుకున్న సర్వేల్లో కూడా నెగిటివ్ మార్కులే
వచ్చినట్లు తెలియటంతో ఆందోళన పెరిగిపోతోంది.
అమలాపురం లోక్ సభ నియోజకవర్గం ఎంపి పండుల రవీంద్ర టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరిన విషయం తెలిసిందే. దాందో ముందుగా ఆ స్దానంలో గట్టి అభ్యర్ధిని రంగంలోకి దింపాలి. దివంగత లోక్ సభ స్పీకర్ జిఎంసి బాలయోగి కొడుకు హరీష్ ను పోటీకి దింపొచ్చని సమాచారం. అయితే, హరీష్ గనుక లోక్ సభకు పోటీ చేయటంపై ఆసక్తి చూపకపోతే అమలాపురం ఎంఎల్ఏ టికెట్ ఖాయమంటున్నారు. అదే జరిగితే సిట్టింగ్ ఎంఎల్ఏ అయినాబత్తుల ఆనందరావుకు టికెట్ గోవిందానే.
ఇక పి గన్నవరం ఎస్సీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంఎల్ఏ పులవర్తి నారాయణమూర్తికి టికెట్ డౌటే అంటున్నారు. ఎందుకంటే, పార్టీతో పాటు చంద్రబాబు చేయించుకున్న సర్వేల్లో కూడా బాగా వ్యతిరేకత కనబడిందట. దానికితోడు ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఛైర్మన్ కారెం శివాజి, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమీషన్ సభ్యుడు స్టాలిన్ బాబు టికెట్ కోసం గట్టి పోటీ ఇస్తున్నారు. రాజోలు అసెంబ్లీ విషయంలో సిట్టంగ్ ఎంఎల్ఏ గొల్లపల్లి సూర్యారావు పై మిశ్రమ రిజల్టుంది. అటు గెలుపుపై పెద్దగా అవకాశాలు లేకపోవటంతో పాటు వ్యతిరేక పవనాలు కూడా పెద్దగా లేవు.
కాకపోతే పార్టీలోనే కొందరు సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారట. గొల్లపల్లి కూడా ఎంపిగా పోటీ చేయాలని ఆసక్తిగా ఉన్నారట. అయితే, ఎంపిగా గెలుస్తారా అన్నదే అనుమానం. మండపేట అసెంబ్లీకి సిట్టింగ్ ఎంఎల్ఏ వేగుళ్ళ జోగేశ్వరరావే పోటీ చేసే అవకాశం ఉంది. వ్యతిరేకత పెద్దగా లేకపోయినా గెలుపుకు చెప్పుకోతగ్గ అనుకూల అంశాలు కూడా లేవు. అందుకనే మున్సిపల్ ఛైర్మన్ చుండ్రు శ్రీహరి ప్రకాశ్ రావు తదితరులు టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
ముమ్మిడివరంలో సిట్టింగ్ ఎంఎల్ఏ దాట్ల బుచ్చిబాబే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్తపేటలో వైసిపి ఎంఎల్ఏ జగ్గిరెడ్డి పోటీ చేస్తారు కాబట్టి పోయిన ఎన్నికల్లో ఓడిపోయిన బండారు సత్యానందరావే టిడిపి తరపున పోటీ చేసే అవకాశాలున్నాయి. రామచంద్రాపురంలో తోట త్రిమూర్తుల విషయమే తేలకపోవటంతో సస్పెన్సులో పడింది. ఈ సీటు విషయంలో చంద్రబాబు కూడా అయోమయంలో ఉన్నట్లు సమాచారం.