తెలంగాణ శాసన సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవంగా పూర్తి చేసేందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చర్చలు మొదలుపెట్టారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు ఇవాల నోటిఫికేషన్ విడుదలకానున్న విషయం తెలిసిందే. ఈ పదవి కోసం టీఆర్ఎస్ మాజీ మంత్రి పద్మారావు గౌడ్ పేరును ఖరారు చేసింది. అయితే పద్మారావును ఏక గ్రీవంగా ఎన్నుకోవడానికి కాంగ్రెస్ ముఖ్య నేతలతో కేటీఆర్ చర్చలకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నాయకులతో ఈరోజు ఉదయం భేటీ అయ్యారు. తొలుత ఆయన సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కను అసెంబ్లీ లాబీలోని కార్యాలయంలో కలిసి మంతనాలు జరిపారు.
డిప్యూటీఅ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని కోరినట్లు సమాచారం. వీరు చర్చలు జరుపుతున్న సమయంలో మాజీ మంత్రి పద్మారావు, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ లు కూడా వచ్చి చర్చల్లో పాల్గొని వెళ్లారు. కేటీఆర్ విజ్ఞప్తిని విన్న భట్టివిక్రమార్క పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డితో మాట్లాడి చెబుతానని అనడం జరిగింది. ఇదే విషయం పై ఉత్తమ్కుమార్ సీఎల్పీ కార్యాలయానికి రావడంతో ముగ్గురు నేతలు ఎన్నిక అంశంపై కలిసి చర్చించారు. తమ నిర్ణయం తర్వాత చెబుతామని మల్లు, ఉత్తమ్లు స్పష్టం చేసినట్లు సమాచారం.
తమ నిర్ణయం తర్వాత చెబుతామని మల్లు, ఉత్తమ్లు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. సీఎల్పీ నేత మల్లుభట్టివిక్రమార్కను ఆయన కార్యాలయంలో కలిసి చర్చలు జరిపిన అనంతరం అక్కడికి పీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ కూడా వచ్చారు. ఆ సమయంలో కేటీఆర్ ఎదురు పడగానే.. ‘ఏంటి...నా ఫోన్ నంబర్ బ్లాక్ చేశావు’ అంటూ ఉత్తమకుమార్ ప్రశ్నించడంతో తొలుత ఆశ్చర్యపోయిన కేటీఆర్ ‘అయ్యో అదేం మాట...మీ నంబర్ని నేను బ్లాక్ చేయగలనా’ అంటూ సమాధానం ఇవ్వడంతో ఇద్దరు నాయకులు నవ్వుకున్నారు.