తమిళనాట విషాదం చోటుచేసుకుంది. విల్లుపురం లోక్సభ సభ్యుడు, అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎస్.రాజేంద్రన్ (62) శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దర్మరణం పాలయ్యారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విల్లుపురం నియోజకవర్గం నుంచి రాజేంద్రన్ ఏఐడీఎంకే తరపున పోటీ చేసి గెలుపొందారు. తొలిసారి ఎంపీగా గెలుపొందిన రాజేంద్రన్.. ఎరువులు, రసాయనాలు స్టాండింగ్ కమిటీలోను, పౌర విమానయాన శాఖలోని ఓ కమిటీలోను సభ్యుడిగా ఉన్నారు.
ఆయన ప్రయాణిస్తున్న స్పోర్ట్స్ కారు డ్రైవర్ రోడ్డుపై ఉన్న స్టాప్ బోర్డును తప్పించే ప్రయత్నంలో వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. క్షతగాత్రులను తక్షణమే సమీపంలోని దవాఖానకు తరలించినప్పటికీ అప్పటికే రాజేంద్రన్ తనువు చాలించాడు.
ఈ కారులో ప్రయాణిస్తున్న మిగతా ముగ్గురు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎంపి రాజేంద్రన్ మృతి పట్ల అన్నాడీఎంకే తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు నేతలు ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు.