ఆయన ఏపీకి ప్రతిపక్షనేత.. కానీ పాదయాత్ర, ఇతర సమయాల్లో తప్ప కనిపించేది ఎక్కువగా హైదరాబాద్ లోనే. ఆయన నివాసం లోటస్ పాండ్ లో.. ఇటీవల ఆ పార్టీలోకి చేరికలు ఎక్కువగా జరిగింది ఈ లోటస్ పాండ్ లోనే. అందుకే టీడీపీ దీన్ని కూడా విమర్శించింది.
ఇక ఈ ఇబ్బందులు జగన్ కు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన అమరావతిలో నిర్మించుకున్న వైసీపీ పార్టీ ఆఫీసు కమ్ ఇంటిలోకి త్వరలోనే వచ్చేస్తున్నాడు. ఫిబ్రవరి 27వ తేదీన బుధవారం ఉదయం 10 గంటలకు కొత్త చిరునామాలోకి మారుతున్నారు. ఈ నివాసం మంగళగిరి మండలంలోని, తాడేపల్లిలో ఉంది. ఇప్పటికే గృహప్రవేశం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.
నూతన పార్టీ కేంద్ర కార్యాలయము మరియు గృహ ప్రవేశము కోసం ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లాయి. మీడియాకు కూడా ఆహ్వానాలు వచ్చేశాయి. ఈ కార్యక్రమంలో భాగస్వాములై తమ ఆతిధ్యం స్వీకరించవలసింది అంటూ ఆ పార్టీ మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి పేరుపై ఆహ్వానాలు అందాయి.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసలు కేసీఆర్ రాక కోసమే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారనే కథనాలు కూడా వెలువడ్డాయి. ఇక ఏదేమైనా జగన్ ను కలవాలంటే పక్క రాష్ట్రం వెళ్లాల్సిన ఇబ్బంది నాయకులకు ఉండకపోవచ్చు.