ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో రెండు మాసాల్లోనే ఎన్నికలు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రతి పార్టీ కూడా వ్యూహా త్మకంగా అడుగులు వేస్తున్నాయి. ప్రతి నియోజకవర్గాన్ని , ప్రతి ఓటును కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి. దీంతో ఎక్కడికక్కడ పోరు తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారం కోసం అటు వైసీపీ, ఇటు టీడీపీలు పోరులో జోరు పెంచాయి. అయితే, ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న మరోపార్టీ జనసేన. కానిస్టేబుల్ కుమారుడు సీఎం కాకూడదా? అంటూ సెంటిమెంటును రగించిన జనసేనాని పవన్ కళ్యాణ్.. దీనికి సంబంధించి రాజమండ్రి, అనంతపురంలో కవాతు కూడా నిర్వహించారు.
ఇక, వాస్తవానికి ఆయన ప్రశ్నిస్తానంటూ ప్రజల్లోకి వచ్చారు. ఏపీ కోసం ఏపీ ప్రజల కోసం అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు 2014 ఎన్నికల్లో మద్దతిచ్చానని చెప్పుకొన్న పవన్.. 2019 ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోరు చేస్తానని చెప్పారు. అంతేకా దు.. మొత్తం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ పోరు ఉంటుందని చెప్పారు. దీనికి సంబందించి ఈయనతో నడిచేం దుకు కమ్యూనిస్టులు రెడీ అయ్యారు. సరే వారికి కొన్ని సీట్లు కేటాయించి అంటే మొత్తం ఓ 15 మహా అయితే 20 వరకు సీట్లు కేటాయించి మిగిలిన వాటిలో జనసేనాని పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు.
అయితే, ఇప్పుడు ఎన్నికలకు ముందున్న పరిస్థితిని చూస్తే.. పవన్ వ్యూహం ఎవరికీ అంతుపట్టని విధంగా ఉంది. ఎన్ని కల్లో పూర్తిగా అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తానని చెప్పిన పవన్.. తీరా ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యం లో మౌనం వహించారు. పైగా ఐదు నుంచి ఆరు జిల్లాల్లో ఆయన కాలు కూడా పెట్టలేదు. కడప, కర్నూలు, కృష్ణా, నెల్లూరు వంటి జిల్లాలపై ఫోకస్ చేయలేదు. దీంతో ఇక్కడ అసలు పార్టీ జెండా పట్టుకునే వారు కూడా లేకుండా పోయారు.
ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో కేవలం 50 స్థానాలలోనే జనసేనాని పోటీ ఉంటుందని, వీటిలో పది కమ్యూనిస్టులకు కేటాయించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు, అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రమే జనసేనాని పోటీ చేస్తారని అంటున్నారు. ఇక్కడ గెలిచే అరకొర సీట్లతోనే తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో చక్రం తిప్పాలని పవన్ భావిస్తున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.