అవును అలాగే ఉంది
చూస్తుంటే చంద్రబాబునాయుడు వైఖరి. పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పడుకోబోయే
వరకూ కెసియార్, జగన్, మోడిని తిట్టటమే పనిగా పెట్టుకున్నట్లున్నారు. విషయం ఏదైనా
సరే పై ముగ్గురికి ముడేసి తన నోటి దురదను తీర్చుకుంటున్నారు. పార్టీ సమావేశాల్లో,
నేతలతో జరిగే టెలికాన్ఫరెన్సుల్లో, ఎవరైనా పార్టీలో చేరే సమయంలోను..సందర్భం
కల్పించుకుని మరీ పై ముగ్గురిపై చంద్రబాబు ఎందుకంతగా ఆరోపణలు, విమర్శలు
చేస్తున్నట్లు ? ఎందుకంటే, ఓటమి భయం పెరిగిపోతున్నట్లే స్పష్టంగా కనబడుతోంది.
మనకన్నా ప్రత్యర్ధి బలంగా ఉన్నపుడే వాళ్ళ గురించి ఎక్కువుగా మాట్లాడుతుంటాం. అదే ప్రత్యర్ధి మనకన్నా బలహీనంగా ఉన్నపుడు అసలు లెక్కే చేయం. ఒకవేళ మాట్లాడాల్సొచ్చినా మాట్లాడే విధానం వేరేగా ఉంటుంది. చంద్రబాబు మాట్లాడుతూ ముగ్గురిని కలిసి ముసుగు తీసేసి టిడిపిపై పోటీ చేయాలని సవాలు విసురుతున్నారు. ముగ్గురు కలిస్తేనే తాను తిరిగి అధికారంలోకి వస్తానని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లున్నారు. అయినా టిఆర్ఎస్, వైసిపి, బిజెపిలు ఎందుకు కలుస్తాయి ? ఎలా కలుస్తాయి ? అన్న ఆలోచన కూడా చంద్రబాబులో లోపించటమే ఆశ్చర్యంగా ఉంది.
తెలంగాణా ఎన్నికల్లో చంద్రబాబు పరువును రోడ్డున పడేసి తెలంగాణా సెంటిమెంటును రెచ్చగొట్టి కెసియార్ లాభపడ్డారు. కాబట్టి కెసియార్ ను ఏపిలో బూచిగా చూపెట్టి తాను కూడా లబ్దింపొందాలన్నది చంద్రబాబు ఆలోచన. అయితే, చంద్రబాబు లాగ కెసియార్ మరీ చవకబారుగా ఆలోచించే నేత కాదు. వైసిపికి ఏదైనా సాయం చేయాలనుకున్నా పరోక్షంగా చేస్తారే కానీ ప్రత్యక్షంగా తెరముందుకు వచ్చే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి.
ఇక బిజెపికున్నదేం లేదు కాబట్టి పోయేదీ ఏమీ లేదు. అందుకనే జగన్ బిజెపికి మొదటి నుండి జగన్ దూరంగానే ఉన్నారు. చంద్రబాబు పోయిన ఎన్నికల్లో బిజెపి చంకనెక్కి తర్వాత దూరంగా జరిగారు. కాబట్టి బిజెపిని వ్యతిరేకించాల్సిన అవసరం చంద్రబాబుకే ఉంది. ఆ విషయం మరచిపోయిన చంద్రబాబు టిఆర్ఎస్, జగన్, బిజెపిలు తనకు వ్యతిరేకంగా కుమ్మక్కైనట్లు మండిపోతున్నారు.
ప్రత్యర్ధులన్నాక ఓడగొట్టాలనే చూస్తారు కానీ ఎవరైనా టిడిపిని గెలిపించేందుకు చూస్తారా ? చంద్రబాబులో ఇంగిత జ్ఞానం కూడా లోపించటమే ఆశ్చర్యంగా ఉంది. పైగా వెయ్యి కోట్ల ప్యాకేజీతో కుట్రలు పన్నుతున్నారంటూ చెప్పటమే విచిత్రంగా ఉంది. వాళ్ళు వెయ్యి కోట్ల ప్యాకేజీతో కుట్రలు పన్నుతుంటే మరి చంద్రబాబేం చేస్తున్నట్లు ?