పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసిన భారత వైమానిక దళానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లకు సెల్యూట్ చేస్తున్నట్లు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. దేశ నియంత్రణ రేఖ (ఎల్ ఓ సీ) వెంబడి పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం లోని ఉగ్ర వాద స్థావరాలపై భారత వైమానిక దళాలు మంగళవారం వేకువ జామున మెరుపు దాడులు చేయడం తెలిసిందే.
మిరేజ్ 2000 యుద్ధ విమానాలు 1000 కేజీల బాంబులను మోసుకెళ్లి ఉగ్రవాదులు స్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో 12 మిరేజ్ 2000 యుద్ధ విమానాలు పాలుపంచుకున్నాయి. మెరుపు దాడులు 100 శాతం విజయవంతం అయ్యిందని, తాము ప్లాన్ చేసుకున్నట్లు జరిగిందని భారత వైమానిక దళ అధికారులు తెలిపారు. అటు దేశ వ్యాప్తంగానూ భారత వైమానిక దళాలు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాద దాడి జరిగిన తరవాత పన్నెండవ రోజున్నే పాక్కు షాక్ ఇచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడింది. ఇవాళ తెల్లవారుజామున 3:30 గంటలకు సుమారు 1000 కేజీల లేజర్ గైడెడ్ బాంబులతో భీకర దాడి చేసింది. యుద్ధ విమానాలు పీవోకే లోకి దూసుకెళ్లి బాంబుల వర్షం కురిపించాయి. జైషే మహమ్మద్ తీవ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. కార్గిల్ యుద్ధం తర్వాత భారత్ వైమానికి దాడులు చేయడం ఇదే మొదటిసారి.
దాడులను భారత్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఐతే, గగనతల నిబంధనలు ఉల్లంఘించి భారత వాయుసేనకు సంబంధించిన ఒక విమానం తమ భూభాగంలో బాంబులతో దాడి జరిపిందని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. పుల్వామాలో భారత సైనికులపై ఉగ్రవాద దాడి తర్వాత దేశం రగిలిపోతోంది. పాక్ పై దాడులు చేయాలని ఒత్తిడి తీవ్రమైంది. దీంతో భారత సైన్యానికి స్వేచ్ఛనిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ప్రతీకారం ఖాయమనే అంచనాలు వచ్చాయి. ఇప్పుడు భారత ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో మరో సర్జికల్ స్ట్రైక్ జరగడం విశేషం.
అయితే ఈ వార్తను భారత ప్రభుత్వం అధికారికంగా వెల్లడించలేదు. పాకిస్తాన్ ఆర్మీ అధికారి మాత్రం ట్వీట్ చేశారు. భారత వాయుసేన పాకిస్తాన్ గగనతలంలోకి వచ్చిందని, తాము వాటిని తరిమికొట్టామని ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీన్ని బట్టి పాకిస్తాన్ పై భారత్ మెరుపుదాడి చేసిందని అర్థమవుతోంది. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా బయటకు వచ్చాయి.
ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన యుద్ధ విమానం ముజఫరాబాద్ సెక్టార్ నుంచి చొచ్చుకొచ్చిందని, దీనిపై అప్రమత్తమైన తమ వైమానిక దళం భారత విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించింది. అయితే, అది త్రుటిలో తప్పించుకుందని, తాము ప్రయోగించిన బాంబు బాలాకోట్ సమీపంలో కూలింది. ఇందులో ఎవరూ గాయపడలేదు అంటూ జనరల్ అసిఫ్ గఫూర్ ట్విట్టర్లో పేర్కొన్నాడు.