'మా భూభాగంలోకి భారత వాయుసేన విమానాలు వచ్చాయి..' అంటూ పాకిస్తాన్ ప్రకటించేసింది. అయితే, 'మేం తరిమికొట్టాం..' అంటూ షరామామూలుగానే పాక్ బుకాయించిందనుకోండి.. అది వేరే విషయం. ఈ ఘటనపై చైనాతో పాకిస్తాన్ మంతనాలు షురూ చేసింది. భారత్పైకి దూసుకెళ్ళడం తప్పదా.? అన్న కోణంలో పాకిస్తాన్ కొత్త ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఉన్నతస్థాయి సమావేశమూ నిర్వహిస్తున్నారు.
'పాకిస్తాన్కి ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్పాం, వంకర తీరకపోతే ఇంకా గట్టిగా చెప్పడానికి సిద్ధంగా వున్నాం..' అని ఇప్పటికే భారత ప్రభుత్వం ప్రకటించేసింది. ప్రకటించడమేకాదు, సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించింది కూడా.! భారతదేశం 12 మిరాజ్ యుద్ధ విమానాల్ని పంపితేనే, పాకిస్తాన్కి చెందిన యుద్ధ విమానాలు బెంబేలెత్తి వెనక్కి పరుగులు తీశాయి. ఒక్కసారిగా భారత్ తరఫున వందలాది యుద్ధ విమానాలు పాకిస్తాన్ వైపుకు దూసుకెళితే పరిస్థితి ఏంటి.? జలాంతర్గాములు రంగంలోకి దిగితే పాకిస్తాన్ ఏమయిపోతుంది.?